పుట:Bobbili yuddam natakam.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 82

     అరుల బొందుల మీఁదుగా నతనికడకు
              క్షణములోఁ జేరుదుము రండు రణపథమున.
౭౧

[వెంకయ్య ప్రవేశించును.]

రంగ. - వెంకయ్యా, ఏమిచేసి వచ్చితివి ?

వెంకయ్య. - మహాప్రభూ! ఎల్లవారితొడుగులు వదలించి వచ్చితిని.

      సీ. వరవుడులుం గూడ వలసపో నొల్లక
                    యిటనె యీల్గఁగ నిశ్చయించుకొనిరి!
              పండ్రెండును *[1]బడాలు వారి గృహంబులు
                    ఖాలి సేయించి యాబాలముగను
              తెలగా పడంతుల, వెలమ మడంతుల,
                     లోనికిఁ దోలి, తల్పులు బిగించి,
              తోరంబుగా నన్ని చూరుపట్టెల వెంటఁ
                     జిచ్చు లంటించి, నేవచ్చినాఁడ.
          తే. గవను తెరచి మనము గడచునప్పటికి భూ
                     చక్రమునకు నాక చక్రమునకు
              మంటయిరుసు గూరి మనకంటి కగపడు,
                     నేల తడయ నింక నేలినదొర.

             రంగ. - [ఆత్మగతము]

     తే. విజయరాముని కోర్కియే విజయ మొందె!
                     పాఒఇ పింజారి హైదరు పలుకె నెగ్గె.
              బొబ్బిలిగడీని బా డిడి పోటు మగఁడు
                     రంగరాయండు వెడలె గౌరవము దక్కి.

ఆహా ! ఆహా ! ఆహా ! [ప్రకాశము] వీరాగ్రణులారా! మనము పరాసుల డేరా మీదికే పోదము ; మఱి తరలుఁడు. గోవిందా, హరి గోవిందా.

[అందఱు 'గోవిందా హరి గోవిందా' అని అఱచుచు వికటముగా నిష్క్రమింతురు.]


___________
  1. *పా. బటాల.