పుట:Bobbili yuddam natakam.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము. 45


[ఆత్మగతము] హా ! ఇందువలననే వారు నాకుం జెప్పక యేఁగినారు. హా ! ఇట్టి వ్రాఁత బ్రహ్మవ్రాసియుండఁగా నరుఁ డేమి సేయగలఁడు ? హాహాహా ! పుట్టలోని యిసుళ్ల నన్నిటిని కిరాతుఁడు పట్టినట్లు కోటలోని మాజాలమునంతయు ఒక్క మొగిని పట్టినాఁడు, విజయరాముఁడో, యముఁడో ! ఈ జోస్యము చూడఁగా, జాబు పాపయ్యకు చేరదు, రాణివాసముల వలసయు జరుగదు, రాయబారంబును ఫలింపదు.

వెంగ. - [ప్రవేశించి] విన్నపము. తమయాజ్ఞను తెలుపఁగానే, రాణిగారికి, చాల కోపము వచ్చినది. జవాబు చెప్పుటకు వారే తమకడకు, అదె వచ్చినారు.

వేంకటలక్ష్మి. - [అపటీక్షేపముగా బ్రవేశించి] జయజయం ఏలినవారికి. దేవి గారు వచ్చియున్నారు.

[అంతట కూఁతునుం గొమరునిం దోడ్కొని రాణి ప్రవేశించును.]

రంగ. - (సంభ్రాంతుఁడై) ఏమి యిది ; స్త్రీలు ఆస్థానికి వచ్చుటా? ఎన్నఁడైన కలదా? ఇ దేమి సాహసము ! ఏమి యీదురాచారము ! మతిపోయినదా ? ఘోషా ఏ మయినది ?

[సభ్యులు మొగమొగంబులు సూచుకొని తటాలున నిష్క్రమింతురు.]

రాణి. - ఇంటికప్పు తెగఁ గాలి, నెత్తిమీఁద పడుచుండఁగా, నిఁక నేమి ఘోషా ? ఇంతకాలమునకు పూసపాటిరాజు నన్ను రచ్చ కెక్కించి, తమతో తెగువ మాట లాడించినాఁడు. ఇన్నాళ్లకు మీ కేమి వెలమబుద్ధి పోయి రాచబుద్ధి వచ్చినది ! మమ్ము నందఱను పాలకొండకు వలస పంపిన, ఆపాలకొండకు ఆణిదారుఁడు గదా ఆపూసపాటిరాజు, అతఁడు లోలోపల, దండు పంపఁడా మామీదికి అక్కడికి? సిపాయి కొక్క వెలమస్త్రీని గట్టఁడా విజయరామరాజు ? పరులచేత చచ్చుటకు మా కేమి కారణము? మీ రేమి ఏలినను, అనంతకాలము రాజ్యము లేలెదరా? యుగములు జగములు గలంత కాలము భూమి పాలించెదరా ? చచ్చిన పేరు బ్రతికిన లేదు. మీరు చావను మేము బ్రతుకను ఆలోచించితిరా? చచ్చినను మేము కోటలో చావవలయును గాని, పరులచేత మేము చావము.

రంగ. - ఈమాట మాతమ్మునిచేత చెప్పి పంప రాదా ? స్వయముగా ఏల రావలయును ?

రాణి. - ఏల యనఁగా, ఈబిడ్డలను మీయొడిలో ఉంచి వారికి మీకు కడసారి చూపు లందిచ్చుటకు తెచ్చితిని. (అని కొమారితను తండ్రి ప్రక్కను నిలిపి) రావమ్మా! సుందరమ్మా ! మీనాయనను, కడసారి చూపు చూచుకోవమ్మా. (పుత్రునింగూర్చి) నాకొండా ! మీనాయనగారియొడిలోఁ గూర్చుండుము.

[అని పుత్త్రుని రంగరాయని యొడిలో కూర్చుండఁబెట్టును.