పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. నా శత్రువులు చూచుచుండగా
నీవు నాకు విందు చేయుదువు
పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు
నా పానపాత్రము అంచులవరకు నిండి పొరలుచున్నది

6. నేను జీవించినన్నాళ్లు
నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును
నేను కలకాలము ప్రభుమందిరమున వసింతును

1. పరిచయం

ఇది విశ్వాస కీర్తనలు అనే వర్గానికి చెందింది. ఈ కీర్తనల్లో భక్తులు తమకు దేవునిమీద మొక్కవోని నమ్మకముందని నిరూపిస్తూంటారు. ఈ గీతాల్లో దేవుడు దేవళంలో వుండి ఆర్తుల మొర వినడం, అతని నమ్మదగినతనం, భక్త వాత్సల్యం, నరుడు శాంతిని భద్రతను అనుభవించడం మొదలైన విషయాలు వస్తాయి. 11, 121, 131 మొదలైనవి ఈ కోవకు చెందిన గీతాలు.

భక్తుడు ఈ గీతంలో దేవునికి రెండుపమానాలు వాడాడు. అతడు తన మందను నడిపించే మంచి కాపరి, తన అతిథికి విందుచేసే ఆతిథ్యకారుడు. ఈ రెండుపమానాలు రచయితకు గల గొప్ప భగవదనుభూతిని తెలియజేస్తాయి.

రచయిత ఈ గేయం వ్రాసిన సందర్భాన్నిగూడ కొంతవరకు ఊహించుకోవచ్చు బహుశః శత్రువులు అతని మీద నిందలు మోపివుంటారు. అతడు విగ్రహారాధనం మొదలైన నేరాలు చేసాడని అభియోగం తెచ్చివుంటారు. అతనికి మరణశిక్ష విధించాలని పట్టుబట్టి ఉంటారు. కాని కీర్తనకారుడు తన దైవభక్తిని నిరూపించుకొని ఈ నిందల నుండి తప్పించుకొన్నాడు. ఆ పిమ్మట అతడు దేవునిపట్ల తనకున్న నమ్మకాన్నీ భక్తివిశ్వాసాలనూ వివరిస్తూ కీర్తన వ్రాసాడు. యెరూషలేం దేవళంలో భక్త సమాజం ముందట తన పాటనుపాడి విన్పించాడు. ప్రభువునకు కృతజ్ఞతాంజలి అర్పించుకొన్నాడు. బలి ముగిసాక మిత్రులతో గలసి దేవళంలోనైవేద్యం సాపడ్డాడు. ఈలా పట్టింది ఈ 23వ కీర్తన. ఈ పాట అన్నిటికంటె అదనంగా భక్తుని హృదయంలోని ప్రశాంత భావాన్ని వెల్లడి చేస్తుంది.

ఇది రత్నంలాంటి కీర్తన. బహుశః బైబుల్లోని కీర్తనలన్నిటిలోను శ్రేష్టమైంది. దీనికి వచ్చిన ప్రాచుర్యం మరే కీర్తనకు రాలేదు. శతాబ్దాల పొడుగునా బైబులు భక్తులు అన్నిటికంటె యొక్కువగా ఈ కీర్తనను ధ్యానం చేసికొన్నారు. ఇది యెందరో పుణ్యశీలురకు