పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. క్రీస్తు ఏలా రాజు?

1. పూర్వవేదంలో తండ్రి ప్రభువు - రాజు. తండ్రి క్రీస్తుని తన ప్రతిరూపంగా లోకంలోకి పంపాడు - కొలో 1,15. కనుక ఆ తండ్రిలాగే అతని ప్రతినిధియైన క్రీస్తుకూడ రాజు.

2. క్రీస్తుకి రాజపదవి జన్మహక్కు గెల్చుకొన్న హక్కుకూడ. మనుష్యావతార మెత్తినప్పటినుండే అతడు రాజు కనుక రాజపదవి అతని జన్మహక్కు పైగా మరడోత్థానాల ద్వారాగూడ క్రీస్తు ఆహక్కునిసంపాదించుకొన్నాడు, అతని పాస్క కార్యాలకు తండ్రి అతన్ని ప్రభువుని చేసాడు - అచ 2,36, కావున రాజపదవి అతడు గెల్చుకొన్న హక్కుకూడ.

3. క్రీస్తు సృష్టికంతటికీ రాజే. అతడు ఇహపరలోకాలకు అధిపతి - ఎఫె 1,21. ఐనా అతని అధికారం ప్రధానంగా ఆధ్యాత్మికరంగానికి చెందింది. "నా రాజ్యం ఈ లోకసంబంధమైంది కాదు" అని అతడే చెప్పకొన్నాడు- యోహాను 18,36, భౌతిక ప్రపంచంమీద అతని అధికారం పరోక్షంగా మాత్రమే చెల్లుతుంది. ఆర్థిక రాజకీయాధి భౌతిక రంగాలకు ప్రత్యేకమైన నియమాలున్నాయి.

క్రీస్తు ప్రధానంగా నరుల హృదయాల్లో రాజ్యం చేయగోరుతాడు. ఈ లోకపు అధికారుల పాలనం ప్రధానంగా పెత్తనం చెలాయించే రూపంలో ఉంటుంది. కాని క్రీస్తు పాలనం ప్రధానంగా సేవచేసే రూపంలో ఉంటుంది. యధార్థంగా అతడు మనలను ఏలడు, మనకు సేవలు చేస్తాడు- మార్కు 10,42-45. నేడు ప్రభువు తిరుసభలో వుండి నరులందరినీ తన చెంతకు ఆకర్షించుకొంటూంటాడు. వాళ్ళకు పరిచర్యలు చేస్తూంటాడు. ఈ తిరుసభకూడ క్రీస్తు పేరుమీదిగా లోకానికి సేవలు చేస్తూంటుంది.

4. క్రీస్తు రాజ్యాధికారం ఈ విశ్వానికంతటికీ వర్తిస్తుంది. స్వర్గ మర్త్యలోకాలూ, నరులూ, భౌతిక వస్తువులూ అన్నీ అతని పాలనం క్రిందికి వస్తాయి - ఎఫె 1,10, తెయ్యార్ ద షార్డాన్ అనే శాస్త్రజ్ఞడు క్రీస్తుని గూర్చి చాల గొప్ప భావాలు చెప్పాడు. క్రీస్తు ఈ విశ్వమంతటిలోను వుంటాడు. ఈ విశ్వమంతా క్రమంగా అతనిలోనికి పరిణామం చెందుతూంటుంది. ఈ లోకానికి అతడు తుదిమెట్టు ఈ ప్రపంచం ఆ తుదిమెట్టును చేరుకోవాలి. అతని లోనికి మారిపోతేనే గాని ఈ జగత్తుకు సార్థక్యం లేదు.

5. క్రీస్తు రాజ్యపదవి లోకాంతంలోగాని పరిపూర్ణం కాదు. లోకాంతంలో అతడు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు -1 కొ 15,24. ఈ రాజ్యం తిరుసభ, దైవరాజ్యం, సర్వ ప్రపంచంగూడ, కాని యిలా అప్పగించడంతో తిరుసభ అంతం కాదు. పరిపూర్ణమౌతుంది.