2.క్రీస్తు మరణాన్నిధ్యానం చేసికొనే మార్గాల్లో ఉత్తమమైంది దివ్యపూజ. ఈ పవిత్ర కార్యంలో పాల్గొనేపడెల్లా మనం ప్రభువు మళ్ళా రెండవమారు విజయంచేసిదాకా గూడా అతని మరణాన్ని ప్రకటిస్తూంటాం. అతని మరణాన్ని తండ్రికి జ్ఞాపకం చేస్తూంటాం, ఆ జ్ఞాపకంద్వారా తండ్రి అనుగ్రహాన్ని పొందుతూంటాం - 1కొ 11, 25-26.
3.మన తరపున మనం ప్రభువు శ్రమల్లో పాలు పొందుతూండాలి. అతని సిలువను మోసూండాలి. అనగా మన జీవితంలో సంభవించే వ్యాధిబాధలనూ కష్టాలనూ ప్రభువుకోసం సదుద్దేశంతో భరిస్తూండాలి. పచ్చి చెట్టులాంటి వాడైన క్రీస్తుకే ఆలాంటి శ్రమలు ప్రాప్తిస్తే ఎండుచెట్టు లాంటివాళ్ళమైన మనకెన్ని శ్రమలు ప్రాప్తించవు? — లూకా 23,31. శిష్యుడు గురువుకంటె గొప్పవాడు కాదుగదా? మన గురువు బాధామయమార్గంలో పయనిస్తే మనం సుఖమార్గంలో పయనించాలి అనుకోవడం భావ్యమా? క్రీస్తు మొదట బాధలనుభవించి అటుపిమ్మట మహిమను పొందాలి. మనకు మాత్రం వేరే మార్గం వుంటుందా? - లూకా 2426. పాటుల సమయంలో క్రీస్తు కురేనియా సీమోనుని సహాయం అంగీకరించాడు- మార్కు 15,21. అతడు మనకుగూడ తన సిలువలో పాలుపంచియిస్తూంటాడు. దీనిద్వారా మనం ఆ ప్రభువుతో అధికంగా ఐక్యమౌతాం.
4.కడన మన మరణాన్నిగూడ ప్రభువుకే అర్పించుకోవాలి. స్వేచ్ఛాపరుడైన నరని చిట్టచివరి కార్యం మరణం. క్రీస్తు తన మరణాన్ని దేవుని కర్పించినట్లే మనం కూడ మన మరణాన్ని క్రీస్తుద్వారా దేవునికి అర్పించాలి. మనం ఉదయకాల సమర్పణంలో రోజువారి పనులను ప్రభువుకి అర్పిస్తుంటాం. కాని ఈ పనులు మన జీవితానికి చెందినవి. అవి మన జీవితమనే చెట్టమీద కాసిన పండ్ల, ఈ పండ్లను దేవునికి అర్పించడం మంచిదే. ఐనా ఆ చెట్టనే దేవునికి అర్పిస్తే ఇంకా యోగ్యంగా వుంటుంది. అనగా మన జీవితాన్నీ మరణాన్నీ ఆ ప్రభువు చేతుల్లోకి అర్పించుకొంటే ధన్యాత్ముల మౌతాం. వేయేల, మనం క్రీస్తుతో బాధలనుభవిస్తే అతనితో మహిమను పొందుతాం - రోమా 8, 17. "క్రీస్తు అనుభవించిన కష్టమా! నాకు ఓదార్పును దయచేయండి" అని ప్రార్ధించాడు ఇగ్నేప్యస్ లొయోలా, ఈ భాగ్యం కోసమే మనమూ వేడుకోవాలి.