భోజనాల ద్వారా గూడ ప్రభువు యూదులకు దైవసాన్నిధ్య మయ్యాడు. నేడు మనం స్వీకరించే దివ్యసత్ర్పసాద భోజనంలో కూడ ఈ భావాలన్నీ ఇమిడివున్నాయి.
యేసు చాలమందిని కలసికొని వారికి ఉపకారం చేసాడు. ఉదాహరణకు చేపలు పట్టుకొనే బెస్తలను తన వెంట రమ్మనిపిల్చాడు. బావివద్ద సమరయస్త్రీతో మాట్లాడి ఆమె మనసు మార్చాడు. జక్కయను చెట్టు దింపి అతనికి పరివర్తనం కలిగించాడు. నాయిూను వితంతువును ఓదార్చాడు. మరియా మార్తల ఆతిధ్యాన్ని స్వీకరించాడు. ఈ వ్యక్తులందరు క్రీస్తుని యెంతో విలువతో చూచారు. అతని ద్వారా దేవుడే తమ్ము సందర్శిస్తున్నాడని నమ్మారు. అతన్ని దేవుని సాన్నిధ్యంగా ఎంచారు. క్రీస్తు నిరంతరం తండ్రితో ఐక్యమై జీవించాడు. ఆ తండ్రే అతన్ని ప్రజలతోగూడ ఐక్యమై జీవించేలా చేసాడు. క్రీస్తుద్వారా తండ్రే యిస్రాయేలు ప్రజలతో ఐక్యమయ్యాడు. తన సాన్నిధ్యాన్ని వారికి దయచేసాడు.
4. అతడు స్వేచ్ఛాపరుడు
క్రీస్తు సర్వతంత్ర స్వతంత్రుడు, అతని ప్రవర్తనం అనూహ్యంగాను విచిత్రంగాను వుండేది. అతడు యూద నాయకుల ప్రశ్నలకు చెప్పిన జవాబులు చిత్రంగా వుండేవి. కైజరుకి పన్ను చెల్లించాలా వద్దా అని అడిగినప్పుడు, నీవు యెవరి అధికారంతో దేవాలయంలోని బేరగాళ్ళను వెళ్ళగొట్టావని ప్రశ్నించినపుడు అతడు చెప్పిన జవాబులు యూద నాయకులను నిరుత్తరులను చేసాయి. అతని సామెతలు ఆకర్షణీయమైనవి. అతని బోధలు పూర్వ రబ్బయుల భావాలు కాదు. అతని సొంత భావాలే. కనుకనే అతని ఉపదేశాలు విని ప్రజలు ఆశ్చర్యపోయారు - మత్త 7, 28-29. మొత్తంమీద అతని బోధలు ప్రజలను గిలిగింతలు పెట్టాయి.
యేసు ప్రజలు కోరినట్లుగా చేసేవాడు కాదు. హేరోదు ఒక అద్భుతాన్ని చేసి చూపించమన్నా చూపించలేదు - లూకా 23,28-29. ప్రజలు తన్నురాజుని చేయబోగా అంగీకరించలేదు - యోహా 6,15. శత్రువులు తన్ను దౌర్జన్యంగా పట్టుకొన్నా తాను వారిపై దౌర్జన్యం చేయలేదు - మత్త 26, 53-54. ఓ మారు క్రీస్తు బంధువులు అతడు పిచ్చివాడు ఐపోయాడనుకొని అతన్ని తీసికొని పోవడానికి వచ్చారు - మార్కు 3,21. అతని శిష్యులే చాలసార్లు అతన్ని అపార్థం చేసికొన్నారు. పేత్రు అతనితో ఈ సిలువమరణం నీకు వద్దన్నాడు - మార్కు 8,32. ఈలాంటి సందర్భాల్లో క్రీస్తు ఇతరులు చెప్పినట్లుగా చేయలేదు. తన పద్ధతిలో తానుపోయాడు. అతనిది స్వతంత్ర ప్రవర్తనం.
యేసు యాదుల ధర్మశాస్త్ర నియమాలకీ వారి సంప్రదాయాలకూ కట్టుపడి వుండలేదు. వాటిని అనుసరించవలసినప్పుడు అనుసరించాడు. త్రోసివేయవలసినప్పడు