2. వివరణం
ఓ రాజు తన సేవకులనుండి లెక్కలు రాబట్టుకొంటున్నాడు. ఇక్కడ సేవకులంటే మామూలు సేవకులుగారు. వీళ్లు శాత్రపులు లేక రాష్త్రాధిపతులు. ఈ గవర్నర్లు తమ తమ రాష్త్రాల్లొ పన్నులు వసూలుజేసి రాజుకు కప్పం బంపుతూండేవాళ్ళు. ఈ కప్పం కొన్ని లక్షల దీనారాలదాకా వుండేది. సరే ఈలాంటి సేవకుడొకడు రాజుకి పదికోట్ల దీనారాలు అప్పపడి వున్నాడు. ఆ డబ్బుకోసం అతన్ని అదివరకే చెరలో వేసారు. చెరనుండి అతన్ని రాజు సన్నిధికి తీసికొని వచ్చారు. అతడా డబ్బంతా అప్పటికే దుర్వ్యయంచేసాడు. మరి యిప్పడు అంత సొమ్ము ఏలా చెల్లించగలడు? రాజు అతని భార్యాబిడ్డలను బానిసలనుగా అమ్మివేయండని ఆజ్ఞాపించాడు. అలా అమ్మితే మాత్రం ఎంత వచ్చేను? ఆ రోజుల్లో బానిసవెల 500 నుండి 2000 దీనారాల దాకా వుండేది. కనుక ఈ సేవకుని కుటుంబాన్నంతటిని అమ్మినా ఓ పదివేల దీనారాలు రావు. మరి అతని అప్ప పదికోట్ల దీనారాలాయె! సేవకుడు రాజు కాళ్ళమీదబడి కొంత పస్తాయించారంటే మీ అప్పంతా తీరుస్తానని మొరపెట్టుకొన్నాడు. కాని అంత అప్ప అతడు ఏలా తీర్చగలడు? ఏమైతేనేం, అతని అడిగింది కొంతకాలం గడువు ఇప్పించమని మాత్రమే. కాని ఆ రాజు ఎంతో దయగలవాడు. అతడు ఈ సేవకుడెటూ అప్ప తీర్చలేడని గుర్తించి, జాలిగలవాడు గనుక, గడువు నీయడానికి మారుగా అసలు అప్పనంతటినీ క్షమించాడు. కొలువులోవున్న సేవకులందరూ రాజు ఔదార్యాన్ని మెచ్చుకొన్నారు.
ఈ సేవకునికి మరో సేవకుడు నూరు దీనారాలు మాత్రమే అప్పపడి వున్నాడు. ఇతడు ఓ వీధిలో అతనిమీద తారసిల్లి వాని కుతిక పట్టుకొన్నాడు. తన అప్ప చెల్లించమని దబాయించాడు. గొంతు పట్టుకోవడం దేనికంటే, ఆ రెండవవాడు తప్పించుకొని పోకుండా వుండేందుకు. ఆ రెండవ సేవకుడు అయ్యా! కొంచెం గడువు ఇప్పించు నీ ఋణం తీరుస్తానని ప్రాధేయపడ్డాడు. ఇక్కడ ఓ విశేషం గమనించాలి. 29వ వచనంలోని ఈ రెండవ సేవకుని మనవి అచ్చంగా 26వ వచనంలోని ఆ మొదటి సేవకుని మనవి లాంటిదే. కాని ఆ మొదటి సేవకుని అప్ప చాల పెద్దది గనుక అతడు దాన్ని తీర్చలేడు. ఈ రెండవ సేవకుని అప్ప నూరు దీనారాలే గనుక ఇతడు దీన్ని తీర్చగలడు.ఇతడడిగింది గూడ కొన్ని నాళ్ళ గడువు మాత్రమే. ఐనా మొదటి సేవకుని హృదయంలో దయలేదు. స్వయంగా దయను పొందినా తాను మాత్రం నిర్ణయుడు. కనుక ఆ రెండవ సేవకుణ్ణి క్షమించనొల్లక చెరలో త్రోయించాడు. తాను అతన్ని బానిసగా ఎందుకు అమ్ముకోగూడదు? ఆనాటి నియమం ప్రకారం కనీసం ఐదువందల దీనారాలైనా అప్పపడితేగాని ఎవరయినా బానిసగా అమ్మడానికి వీల్లేదు. మరి ఇతని అప్ప నూరు దీనారాలే!
సరే, రాజుకి ఈ సంగతి తెలిసింది. అతడు మొదటి సేవకుణ్ణి పిలిపించి కఠినశిక్ష విధించాడు. ఔను, పదికోట్ల దీనారాలకు మన్నింపు పొందినా, తాను నూరు దీనారాల