పుట:Bhaarata arthashaastramu (1958).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన జనులు రెండుబేరములు ముగించులోపల వారు నూరుమందితో వ్యాపారము జరుపగలరు. మోసముజేసి యార్జించి యేదేశమువారును వృద్ధిజెందరని పూర్వమే నిర్ణయింపబడియె. చూడుడు ! ఇంగ్లాండు దేశమెక్కడ, ఇండియా చీనా జపాన్ అనుదేశము లెక్కడ ! వారు తెల్ల వారు, క్రైస్తవులు, వర్ణమతభాషాది విషయములలో మనకు వారికి నేలాటి సంబంధమునులేదు. ఇట్లుండియు వారు ప్రపంచమంతయు వ్యాపించిన బేహారము నడపెదరు. సత్యములేనిది సర్వవ్యాపిత్వము సిద్ధించునా ? యోజింపుడు. నేరుగా మాటలాడి బేరము చేయుటకు వీలులేదుగదా ? నేరు బేరములేని వ్యాపారము నమ్మకముమీదగాక మఱెట్లు సమకూరును ? యోగ్యత, న్యాయము, నాణెము ఇవి మొత్తముమీద ప్రసిద్ధములుగ నుండకుండిన నమ్మకము కలుగుట యెట్లు ? చెడ్డనుండి మంచివచ్చుట దుర్లభము. మంచికి మంచియే కారణము. ఐరోపియనులు పరరాష్ట్రముల నన్యాయముగ నాక్రమించి తన్మూలమున ధనికులైరని కొందఱనెదరు కాని యిదియు విచారించిచూచిన వారికి గౌరవావహమైన విషయమే కాని లజ్జాకరంబుగాదు. పరరాష్ట్రముల నాక్రమించుటకు వలయు సాధనములెవ్వి ? వీరులైన భటులు, యుద్ధోపకరణములగు ఫిరంగులు మొదలగువాని తత్త్వము నెఱింగి నానాటికి వృద్ధిసేయు ప్రకృతి శాస్త్రజ్ఞులు, ముందు వెనుకలు విచారించి సమయాసమయములు గుర్తింపనేర్చిన మంత్రులు, సీమాంతరములలో నెవరైన గ్రొత్తగా నేదియైన గనిపట్టిన దానిని గ్రహింప నుత్సాహముగల విద్యార్థులు, ఐకమత్యము, స్థైర్యమునుగల జనులును ఇట్టి లక్షణములును, సాధనములును నుండినగాని పరరాజ్యముల నోడించుటకు సాధ్యమగునా ? కూపస్థమండూకములట్లు ఒకచోటికినిబోక నూతన విషయములు గ్రహింపక, పెద్దలమార్గములోనే యుండెదమను మూర్ఖులు పెద్దలతోనే కలిసికొందురుగాని యీ లోకమున దమకును