ప్రపంచములో కొట్లాడి, 80 సంవత్సరముల వయస్సున, లండను పట్టణములో, 1749 సంవత్సరమున, కీతు స్వర్గస్థుం డయ్యెను.
కన్యకరీడుయం దపేక్షకలవాడై, యామెను బెంజమిను మరవలేదు. లండనులోనుండు దినము లంతమగుముందు, రాల్ఫుగారి చిక్కును వదిలించుకొని, బెంజమిను స్వస్థతను బొంది, ప్రాచీనమోహమంకురింప, "మోహపాశములలో చిక్కి, వీనిమూలమున నింగ్లాండునుండి ఫిలడల్ఫియాకు వచ్చితి" నని బెంజమిను వ్రాసెను. ఇత డింగ్లాండునుండి రాడని నిశ్చయించి, "రాజర్సు" అను కుమ్మరివానిని కన్యకరీడు వివాహమాడెను. ఈ దాంపత్య మనుకూలము కానందున, వానిని విడనాడి, కన్యకరీడు తన మాతృగృహము వచ్చి చేరియుండెను. ఈ సంగతులు బెంజమినుకు దెలిసి, ఇదియంతయు తనలోపమువలన జరిగినదని విచారించెను. ఋణస్థుల బాధపడ లేక, 'కుమ్మరి రోజర్సు' పశ్చిమ దీవులకు బోయి, కొంతకాలమున కక్కడ మృతినొందె నని వార్త వచ్చెను.
బెంజమిను దేశములో లేని సమయమున, కీమరు వ్యాపారమును బాగుగ నడిపించినటులు కనబడెను. మునుపటి దానికంటె బాగుగనున్న బసలో కీమరు దుకాణమును పెట్టెను. ముద్రాక్షర శాలకు కావలసిన నూతన కూర్పులను (New types) వాడు