86
అన్నమాచార్యుని నాఁట సంకీర్తనములు తాటియాకులమీఁద వ్రాసియుంచఁబడెనేమో! ఆతని తర్వాత పెదతిరుమలాచార్యుఁడు వానిని రాగి రేకులమీఁదఁ జెక్కించెను. రాగివిలువయు, చెక్కించుకూలియు నిప్పటిలెక్క ప్రకారము లక్షలగును. ఒకరో యిద్దరో అక్షరములఁ జెక్కువారగుచో నదియొక పురుషాయుషమునంతకాలము జరపినఁ దేల వలసినవనియగును. రాగిఱేకులను జెక్కినవాఁడు-అన్నమరాజు తిమ్మయ్య అని కొన్నిఱేకులమీఁద నున్నది.
పెదతిరుమలాచార్యుని తర్వాత చినతిరుమలాచార్యుని సంకీర్తనములుకూడ రాగిఱేకులకెక్కినవి. 1540లో సంకీర్తనభండారము దగ్గఱ సేవచేయు వైష్ణవు లిర్వు రుండుట, సంకీర్తనములు పాడేవారు కొంద ఱుండుట, కైంకర్యములు దీపారాధనలు జరుగుచుండుటయు తాళ్ళపాకవారి శిలా శాసనముల కెక్కి యున్నవి.[1]
ఈ సంకీర్తనభండారము (తాళ్ళపాకవారి అర) ద్వారమున కిరు ప్రక్కలనే విగ్రహము లున్నవి. అవి యన్నమాచార్య తిరుమలాచార్యు లివి.
చినతిరుమలయ్య
ఈతఁడు పెదతిరుమలయ్య పెద్దకుమారుఁడు. అనమాచార్యుఁ డితనికి బ్రహ్మోపదేశము (ఉపనయము) చేసెను. ఇందుకు సంకీర్తనము:
లలిత
తాళ్ళపాకాన్నమాచార్య దైవమవు నీవు మాకు।
వేళమె శ్రీహరిఁ గన వెర వానతిచ్చితివి ॥పల్లవి॥
గురుఁడవు నీవె సుమ్మీ కుమతి నైననాకు ।
సరవి బ్రహ్మోపదేశము సేసితి ।
- ↑ చూ. తిరుపతి దేవస్థానం శాసనము నెం 144 నెం.4 వాల్యుం.