83
శ్రీస్వామివారికిని ఎగువ దిగువ తిరుపతులను కడమ చోట్లను వెలసిన వేల్పులకు బహువిధభక్ష్యభోజ్యాది నివేదనలను నిత్యోత్సవ పక్షోత్సవమాసోత్సవ వర్షోత్సవాదులలో నింక ననేకవిధముల కైంకర్యములను వనభోజన వినోదములను తమ వంశపారంపర్యముగా తమ పేర జరపించుటకు బయిగ్రామములను ధనమును శ్రీభండారమున నర్పింపగాఁ గోవెలస్థానపతు లందుకు సమ్మతిగా శాననములు చెక్కించిరి.
ఇవిగాక వీరు కట్టించిన కట్టడములు వగైరాలు:- స్వామిపుష్కరిణి జీర్ణోద్ధారము, మెట్లు, మండపములు, నీరాడుమండపము కొండమీఁద తాళ్ళపాకవారి యింటి ముందు మండపము, సంకీర్తన (సంకీర్తనములు చెక్కిన రాగిరేకులు దాచి ఉంచినది) భండారము, అక్కడ దీపారాధనలు, అక్కడ సంకీర్తనలు పాడే వైష్ణవులకు జీతాలు, గుడిగ్రామాలలో చెరువులు కాలువలు బాగు చేయించుటకు ధనదానము, ఆళ్వారుతీర్ధము దగ్గఱ శ్రీలక్ష్మీనారాయణస్వామి ప్రతిష్ఠ ఇత్యాదులు.
కొన్ని ఉత్సవములలోని ముఖ్యాంశులు:- శ్రీనివాసమూర్తికి ప్రతిశుక్రవారము తిరుమంజనము పిదప పునుఁగుతైలము పూయునప్పుడు పన్నీరుచెంబు సత్కారముపడయుట (తాళ్ళపాకవారు సంకీర్తనములు అప్పుడు పాడేవారు), అచ్యుతరాయల జన్మనక్షత్రమగు మృగశిరనాఁడు ఉత్సవముజరపుట, స్వామిపుష్కరిణి గట్టున తాళ్ళపాకవారు నిర్మించినరాతి స్తంభముమీఁద సంవత్సరము పొడుగునా ప్రతిగురువారము దీపారాధన, ముక్కోటి ఏకాదశినాఁడు స్వామిపుష్కరిణి గట్టున ముప్పది దీపాలు, సంకీర్తన భాండారము దగ్గర నాల్గు తిరుబోనములు దీపాలనూనె ఆభాండారములో సేవచేసే శ్రీవైష్ణవుల జీతాలు వగైరాలు.
తిరుమలయ్యగారికి శ్రీపతితొన్నడయ్య అనీ తిరుపతి చేరువనున్న కులశేఖర పురవాస్తవ్యుఁడు పల్లి పట్టురయ్య అనీ ఇద్దఱు సాతాని వైష్ణవులు శిష్యు లుండిరి. వారు కూడ స్వామికిఁగైంకర్యములు జరపిరి.