సంఘలోపాలను సంస్కరించుచు వచ్చిరి. అట్టివారిలో ముఖ్యులు వేమనయోగి, పోతులూరి వీరబ్రహ్హ్మముగారు.
పోతులూరి వీరబ్రహ్మము కమసాలివాడు. క్రీ.శ. 17-వ శతాబ్ద మధ్యమువాడు. కర్నూలులోని పోతులూరను గ్రామవాసి, చిన్నప్పుడు బనగానపల్లెలోని వెంకట రెడ్డి అనువాని యింట పశుల గాసినవాడు. "ఇతడు విగ్రహారాధనలు, జాతిభేదములు మున్నగువానిని ఖండించి, ప్రజలకు హితోపదేశము చేసెను. ఇతడు సంసారి. భార్య గోవిందమ్మ. ఇతని కనేక శిష్యులు గలరు. అందు దూదేకుల సిద్దయ్య అను తురక ముఖ్యశిష్యుడు." (రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు - వేమన)
వేమన జగమెరిగిన వేదాంతి. సంఘ సంస్కారి. అందరిని తిట్టుచునే నవ్వించి, బుద్ధిచెప్పి చక్కనిబాట చూపినవాడు. వేమనకాలములో లింగాయతులు, వైష్ణవులు తమతమ మతప్రచారములు చేసుకొన్నవారు. ఆయిరువురిలోని లోపాలను వేమన బయట పెట్టినవాడు.
'లింగ మతములోన దొంగలుగా బుట్టి
యొకరి నొకరు నింద నొనరజేసి
తురకజాతిచేత ధూళియై పోదురు
విశ్వదాభిరామ ! వినుర వేమ !'
తురకమతవ్యాప్తి నిట్లు వేమన వర్ణించెను.
"పసరపుమాంసము బెట్టియు
మసకల సులతాను ముసలిమానుల జేసెన్".
వైష్ణవుల నిట్లు తూలనాడెను.
"ఎంబెరుమతమందు నెసగ మాంసము దిని"
"మారుపేర్లు పెట్టి మదువు ద్రావి
వావి వరుస దప్పి వలికి పాలౌదురు ॥
విశ్వ॥
"
"రంగధామమునకు హంగుగా తానేగి
కల్లుకంపు సొంపు కలిగియుండు."
పై నాలుగుపద్యాలు వేమనవి కావని నా అనుమానము. వేమన పేరుపెట్టి పరస్పరము దూషించుకొన్నవారి హస్తలాఘవముగ కనబడుచున్నది. వేమన