పుట:Andrulasangikach025988mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్ణాట దేశములకు సంబంధించినదైనను పశ్చిమ చాళుక్యులను తర్వాతి కాకతీయు లనుకరించిన వారగుటచే సోమేశ్వరుడు తెలిపిన పన్నుల విధానమును బట్టి తెనుగు దేశమందును కొంత సాదృశ్యముండెనని ఊహించుకొన వచ్చును.

"పశుహిరణ్యములపై 50 వ భాగమున్నూ; ధాన్యములో 6, 8 లేక 12 వ భాగమైనను; వక్కలు, నేయి, రసగంధౌషదములు, పుష్పఫలములు, గడ్డిపాత్రలు, చర్మములు, మట్టిపాత్రలు, వీటిలో ఆరవభాగమున్నూ తీసుకొనవలెను. శ్రోత్రియ, బ్రాహ్మణులనుండి పన్ను తీసుకొనరాదు. పశువుల మేపుటకై కొంత భూమిని (గాయిరాన్) వదలవలెను."

(అభి. ప్ర. 1.ఆధ్యా 2)

దక్షిణ దేశ మందు ఆంధ్ర కర్ణాటకులలో లలితకళలకు ప్రాధాన్య ముండెను. నాట్యభంగిమములు, వాద్యవిశేషములు కొన్ని దక్షిణమందు భిన్నముగా నుందెను. "నృత్తగీతాదికములు ద్విజన్ముల ధర్మముకాదు" అని తాప్తముద్ర నిషేధ విచారమందు చెప్పిరి (అభి-పీఠిక). ప్రతిమాశిల్పములు, చిత్తరువులు శూద్రుల కళలై యుండెను. (అభి-పీఠిక). కాకతీయ కాలమందును సాధారణ జనులు కూడ ఇంటిగోడలపై చిత్తరువులు వ్రాయించుకొనిరి. అందుచేత అభిలషితార్థములో తెలుపబడిన చిత్రలేఖన విద్యావిషయమునకు చాల ప్రాముఖ్యము కలదు. అలేఖ్యకర్మ అను పేరుతో 100 పుటలవర కిందు వివరించినారు. చిత్తరువులను గురించి మన ప్రాచీన వాఙ్మయము లంతగా కానరావు. విష్ణు ధర్మోత్తర మను పురాణమందు (అది బహుశా క్రీ.శ. 800-1000 ప్రాంతములో రచింపబడెనేమో) కొంత విపులచర్చ కలదు. దానినే స్టెల్లా క్రమ్రిష్ అను రష్యాకన్యక ఇంగ్లీషులోని కనువర్తించెను. కాని దానికన్న ఎన్నియో రెట్లు ఉత్తమముగానుండు చిత్రకళాశాస్త్రము, ఈ సోమేశ్వరునిదే యనవలెను. బహుశా ఇంతకన్న మేలైన చిత్రలేఖన శాస్త్రము మనలో లేదనవచ్చును. ఈ భాగము నంతయు తెనుగులోనికి పరివర్తింపజేయుట బాగని తోచును. ఇందు చేతిచిత్రముల కవసరమగు రంగులను సిద్ధము చేసుకొనుటను మొదలు తెలిపినారు. గోడపై మంచి గట్టిగచ్చుతో చదును చేయవలెను. దున్నపోతు తోలు కత్తిరించి ముక్కలుచేసి నీళ్ళలో అవి మెత్తనగువరకు కొన్ని దినాలు నానబెట్టి దాని మడ్డిని తీసుకొని వెన్నవలె మెత్తబరచి దానిని లేపనముగా వాడుకొన వలెను. నీలగిరిలో లభించు శంఖచూర్ణమును దానిలో కలుపవలెను. సన్నని