పుట:Andrulasangikach025988mbp.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాణెములలో ప్రత్యేక కృషి చేసినవారు విజయనగర కాలములో టంకాలుండినట్లు వ్రాయలేదు. అవి బంగారువి. కొత్తటంకాలైతే బీరపూలవలె మెరసెడివి. శ్రీనాథుని కిదే విజయనగర రాస్థానమందే టంకా స్నానము చేయించిరి. అట్టిచో నాణ్య నిపుణులు దానిని పేర్కొనకుండుట యేలనో తెలియరాదు.

       కవులు కూర్చొను స్థలమును శంఖపీఠి యనిరి. ఇది తమిళ దేశాచారము.

       "ఈ కవితాభిమానము వహించితి నేటికి శంఖ పీఠికపై
       నీ కవు లున్న యట్లు వసియింపక దేవునితోడ నేల చా
       ర్వాక మొనర్చితిన్.[1]

ఇచ్చట శంఖపీఠి యన నేమో? శ. ర. లోను, శబ్దకల్పద్రుమములోను లేదు. మధురాది తమిళ ప్రాంతాలలో పూర్వము సంగము (సంఘము) అను కవుల పీఠము లుండెను. దానినే మన కవి శంఖము చేసెను."______రాళ్ళపల్లి.

అగ్రకవియగు అల్లసాని పెద్దనకు రాయలు స్వయముగా గండపెండేరము తొడిగించుటయు, అతని పల్లకిని స్వయముగా మోయుటయు, ఆతడెదురైనచో మత్తకరీంద్రము నాపి ఏనుగుపై నెక్కించుకొనుటయు, ఐతిహ్య ప్రసిద్ధములు. రామరాజ భూషణుడు, భైరవికవితాత, రాజుల గద్దెలపై రాజుల ప్రక్కన కూర్చునిరనియు వ్రాసినారు. బ్రాహ్మణులలో పలువురు మంత్రులు, దండనాయకులు, మండలాధికారులై యుండిరి. ఈ విధముగా బ్రాహ్మణులకు సర్వత్ర అపూర్వ మర్యాదలు జరిగెను.

శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా ఎట్టి వస్త్రభూషణములు ధరించెనో సమకాలికు లిట్లు వర్ణించిరి.

"రాజు రెండుజేనల పొడవుగల జరీటోపీని దరించెడివాడు. యుద్ధానికి వెళ్ళినపుడు నూలురుమాలను కట్టి దానిపై నానారత్న భూషణములను పెట్టుకొంటూ వుండెను. జరీపనిగల తెల్లని వస్త్రముల కట్టెను. చాలా విలువగల రత్నాలహారములను కంఠసీమ ధరించెను. తలపై జరీపట్టుటోపీ ధరించెను. రాజభవనముల కావలిగాయు పరిచారికలు కూడా టోపీలు ధరించిరి."

న్యూనిజ్ ఇట్లు వ్రాసెను.

  1. శ్రీ కాళహస్తీశ్వర మహార్మ్యము. 3 - 174