సింధురమహాశ్వముఖ్యము ల్చేర్చు దౌల
దీని వణిజులకూళ్ళు సద్గృహములు పురి
గొలుపుదేజంబు వెల మేలుగలుగ ప్రాత
వారిగా జేయు నరి నవి చేరకుండ.[1]
దూరదేశపు దీవులనుండి, దేశాలనుండి వర్తకులు ఏనుగులు, పెద్ద గుర్రాలు తెత్తెరు. వారికి మంచి యాదరణ గావించి, వారి విడిదికి మేలైన యిండ్లిచ్చి, గ్రామాలిచ్చి, రాజదర్శనమిచ్చి, మంచి మర్యాదలిచ్చి యాదరించవలెను. లేకున్న వారు ఏనుగులను గుర్రాలను శత్రురాజులకు ముట్టజెప్పుదురని పై పద్య భావము.
శ్రీకృష్ణదేవరాయ లక్షరాలా యీ నీతిని పాటించెను. ఈరానీ రాయబారి తనకు దర్బారులో ప్రత్యేక గౌరవమిచ్చి వీధులలో ఎదురైన తన యేనుగు నాసి కుశలాదులను విచారించి చాలా ప్రేమతో ఆదరించెనని వ్రాసుకొనెను.
పాండ్య దేశమందలి తామ్రపర్ణీ నదిలో పెద్దజాతి ముత్యములు పూర్వము లభించెను. ఆముక్తమాల్యదలో,
"తామ్రపర్ణి గలుగు అల ముట్టరాని ముక్తామణీకులంబు" అని వ్రాసినారు.[2]
"మౌక్తికవ్రాతములై వెలుంగు తామ్రపర్ణీ తటమట్లు" అని అల్లసాని కూడా వ్రాసెను.[3]
తూర్పున పెగూనుండి, మలకానుండి ఎర్రసముద్రానికి వెళ్ళు ఓడలు కాలికట్టురేవులో ఆగి, సరకులను కొనిపోయెడివి. ఆనాడు వర్తకమంతయు ముసల్మానులదే. అందెక్కువగా అరబ్బులే చేసిరి. వారు ఆఫ్రికాకు తూర్పుననుండు మడగాస్కరు దీవినుండి ఇండియాకు తూర్పున నుండు మలాకావరకు రేవులలో నిలిచి వ్యాపారాలు చేసిరి.