సీజర్ ప్రెడరిక్ అనువాడిట్లు వ్రాసెను. "గోవా రేవుద్వారా విజయనగరానికి అరేబియా గుర్రాలు వెల్వెట్ బట్టలు, డెమాస్కస్ వస్త్రాలు, పోర్చుగల్ నుండి అర్మోసిన్ (Armosine) అనునది దిగుమతి యవుతుండెను. ఒక గుర్రానికి కావలసిన వస్తువు లేయేదేశములందు సిద్ధ మయ్యెడివో యీక్రింది పద్యము తెలుపుతున్నది.
"పచ్చని హురుమంజి పనివాగె పక్కెర
పారసి పల్లంబు పట్టమయము
రాణ నొప్పారు పైఠాణంబు సింగిణి
తళుకుల కోరుల తరకసంబు
మిహి పసిండి పరంజు మొహదా కెలం
కులు ఠావు గుబ్బరిసేత కేవడంబు
డాకెలంకున సిరాజీ కడి చురకత్తి
కురగట క్రొవ్వాడి గొరకు పొరిది."
(మను. 4 - 28.)
పైఠాణము=పైఠన్ (ప్రతిష్ఠానము-ఔరంగాబాదు జిల్లాలోనిది). సిరాజీ=ఈరానులోని షీరజ్ పట్నము. పట్టుబట్టలు సూరతు రేవుద్వారా కూడా దిగుమతి యయ్యెను. కంచినుండి తెనుగు దేశానికి మంచి నేత నూలుబట్టలు వచ్చెను. శ్రీవైష్ణవులు "పదియారు మూర డంబరపుటంచు కమ్మడాల్ కంచి దోవతి చెల్వు మించు లెసగ" కట్టుకొనుచుండిరి. (కృష్ణరాయ విజయము, 2-2) ధనికులు "పసిండి వ్రాతల దంతపు< బెట్టెలలో" ఆభరణములుంచు కొనిరి. (రాదామాదవము, 4-172)
"విజయనగర సామ్రాజ్యము నుండి బట్టలు, బియ్యము, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి యయ్యెను. తమిళ దేశపు రేవగు పులికాటునుండి మలాకా, పెగూ, సుమత్రా దేశాలకు రంగు అంచులు ముద్రలు కల (కలంకారి) వస్త్రముల నెగుమతి చేసిరి. బియ్యము బస్రూరు, బారకూరు, మంగళూరు నుండి మలబారుకు, మాల్డీవులకు, హుర్మజుకు, ఏడెన్కు ఎగుమతి యయ్యెను. భట్కల్ నుండి చక్కెర, ఇనుము ఎగుమతి యయ్యెను."
"గుర్రాలు, ఏనుగులు, ముత్యాలు, రాగి, ముత్తెపు చిప్పలు, పాదరసము, కుంకుమ, చీనాపట్టు, ముఖ్మల్ సామ్రాజ్యములోనికి దిగుమతి యయ్యెను. ఏను