పుట:Andhrula Charitramu Part 2.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"శ్లో. శ్రీమత్పోత్తపి నన్నెచోడతనయః శ్రీవేఙ్కభూపాలకః
తత్పుత్త్రోరిపదాచలా పహపవిః కామాక్షితీనాయకః
సూనుః సూర్యకులాన్వయామ్బుధిశశీ శ్రీబల్లిభూపాలకః
గౌరీనాథ పదాబ్జ వన్దిత గుణః సౌజన్య రత్నాకరః"

అను శ్లోకమాశాసనముల మొదట వ్రాయబడియున్నది. దీనింబట్టి పొత్తపి నన్నెచోడునకు వేంకభూపాలుడును, వానికి కామాక్షితి నాయకుడును, వానికి బల్లిభూపాలకుడును జనించినట్లుగా దెలియుచున్నది. ఇందొకటి శా.శ.1067వ సంవత్సరముకు సరియైన క్రీ.శ.1145_46వ సంవత్సరమునను, మరియొకటి శాశ.1088వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1166_67వ సంవత్సరమునను, శ్రీమన్మహామండలేశ్వర బల్లిచోడ మహారాజుచే వ్రాయింపబడినవి. ఈ శాసనములలో నన్నెచోడుడు చోడబల్లికి బ్రపితామహుడై యుండగా, కొణిదెన శాసనములలో నన్నెచోడుడు చోడబల్లికి మునిమనుమడైయున్నట్లుగా జెప్పబడియున్నది. మన్నేపల్లి శసనములలోని చోడులును, కొణిదెన శాసనములలోని చోడులు నొక వంశములోని వారై యొక్క ప్రదేశమునే పరిపాలించుచున్న వారనుటకు ననేక నిదర్శనములు గానంబడుచున్నవి. కొణిదెన శాసనములలో మొదట గన్పట్టెడి "స్వస్తిచరణ సరోరుహ విహిత విలోచన ప్రముఖాఖిల పృథివీశ్వర కారిత కావేరీ తీరకరికాల కులరత్న ప్రదీపాహిత కుమారాంకుశ"యనెడి సంస్కృత వాక్యము, మన్నేపల్లి శాసనములందును గానంబడుచున్నది. మన్నేపల్లి శాసనములలోని వంశమును చోడబల్లికి బూర్వమందును, కొణిదెన శాసనములలోని వంశమును బరమందును బెట్టి వంశమును సమన్వయింప బ్రయత్నించుటకైన నా శాసనములలో నుదాహరింపబడిన సంవత్సరములు బాధించుచున్నవి. ఆ సంవత్సరములు సరియైనవి కావని సహేతుకముగ ఋజువు చేసిన గాని సమన్వయము సాధ్యము గాదు.

[1]

  1. Nellore Incriptions D.Nos. 48.49.