పుట:Andhrula Charitramu Part 2.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లాడనాథదేవమహారాజు, అండలూరి విజయాదిత్యదేవుని మనుమడు మధుసూధనదేవమమారాజు, భీమయదేవమహారాజు కొడుకు సిద్ధమదేవుల విజయదేవుడు, విజయాదిత్యదేవమహారాజు మొదలగు పల్లవరాజులు పదమూడవ శతాబ్ద మధ్యమున తెలుగు చోడ రాజులకు సామంతులుగ ఉండి వర్థిల్లుచుండిరి. పల్లవులలో కొందరును, తెలుగు చోడులలో కొందరును,తాము రాజ్యాధికారము వహించినవారు కాకపోయినను రాజకుటుంబములయందు జనించినంత మాత్రముననే మహారాజబిరుదములను వహించి తమతమ దానశాసనములందు వానిని వల్లెవైచి మనకీకాలమున జరిత్రరచనకు పెక్కు చిక్కులను కల్పించియున్నారు.

యాదవ చాళుక్యరాజులు

చాళుక్యచోడ చక్రవర్తులగు మూడవ కులోత్తుంగచోడదేవునకును, మూడవ రాజరాజచోడ దేవునకును,సామంతులుగనుండిన కొందరు తాము చాళుక్యవంశజులమనియు, యాదవవంశజులమనియును చెప్పుకొని ఉన్నారు. వీరి శాసనములు చిత్తూరు మండలములోని కాళహస్తిలోను, చెంగలుపట్టు మండలములోని రామగిరిలోను, దక్షిణార్కాటు మండలములోని తిరువణ్ణామలలోను కనిపించుచున్నవి. మరికొన్ని శాసనములు వేంకటగిరి సీమలోని చాపలపల్లి గ్రామములోను కనుపట్టుచున్నవి. ఈ శాసనముల వలన తెలియదగిన ముఖ్యాంశమెద్దియన, నీ వంశములో చేరిన భుజబలసిద్ధరాజను నామాంతరముగల రాజమల్లదేవుడు పాకనాటలో నాగపడోలను ప్రదేశమునకు బ్రాహ్మణులననేకులను రప్పించి అనేక నివేశనములనిప్పించి ఆ పట్టణమునకు రాజమల్లచతుర్వేదిమంగళమని నామంబిడుటయే. ఆ కాలమునందే ఆతడా గ్రామమునందు విజయదేవియను నామాంతరముగల కమలమహాదేవి యను తన దేవిపేరిట గమలమహాదేవిపుత్తేరి అను తటాకమును నిర్మించెను. వీరి శాసనములున్న విష్ణ్వాలయమాకాలమున యాదవనారాయణపెరుమాళ్ళ కోవెల అని పేర్కొనబడుచుండెను. అదియుగూడ నా కాలముననే కట్టబడియుండును. ఇప్పుడెచ్చటను గానరాని తిరునగరేశ్వర మొడయరుని దేవళము