పుట:Andhrula Charitramu Part-1.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్ధచతుర్థి (నాగులచవితి) వలెనె మహారాష్ట్రాది దేశములందు నాగపంచమియను పేరను కార్తీకశుద్ధపంచమి పర్వదినముగా బరిగణింపబడుచున్నది. దీనినంతయును బరికించిచూడగా నీయాచారములన్నియు నాగులనుబట్టి మనకు సంక్రమించినవిగాని యివి నిజముగా నార్యాచారములుగావు. ఈ యనార్యాచారములు విశేషముగా దక్షిణాపథమునందే గానంబడుచున్నవిగాని యుత్తర హిందూస్థానమునందు గానంబడకుండుటకు గారణము దక్షిణాపథవాసులు సంపూర్ణముగా నార్యాచారములకుదలయొగ్గి వానిలో మునింగిపోయిన వారు గాకుండుటయె గాని వేఱొండుగారణము గానరాదని చెప్పవచ్చును.

నాగోత్పత్తి కథనము.

మహాభారతమునందు నుపోద్ఘాతము ముగింపబడిన వెనుక నీనాగులచరిత్ర మొదట చెప్పబడినది. కశ్యపుడను నార్యునకు కద్రువ, వినతయను నిరువురు భార్యలుగలరు. వీరిరువును తోబుట్టువులు. వీరికింగల యభిమతంబుల చొప్పున గద్రువకు సహస్రనాగములు జనించినవి. వినతకు గరుడుండు జనించెను. కద్రువకు జనించిన సహస్రనాగములకు బుట్టిన సంతతియే లోకమునందలి నాగకులముగానున్నది. ఈ నాగులలో బ్రముఖముగా నుండినవారు శేషుడు, వాసుకి, ఇరావంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు, ఐలుడు, ఇలాపాత్రుడు, నీలుడు, అనీలుడు, నహుషుడు మొదలగువారు. (అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు వీరినే అష్టనాగములని మన గ్రంథములు పేర్కొనుచున్నవి.) కద్రువ వినతకు జేసిన యపకారమునుబట్టి వినతకు బుట్టిన గరుత్మంతుడు నాగకులమునకెల్లను వైరియయ్యెను. 'దీనికిదోడు మాతృశాపముగూడ నాగులకు సంభవించెను. ఈ నాగులచరిత్రము మహాభారతమునందు నివురుగప్పిన నిప్పువలెనున్నది. గులకఱాళ్ళలో మాటుపడియుండిన రత్నమువలె బ్రకాశింపకయున్నది. ఈ గులకరాళ్ళను దొలగించిన నాగులచరిత్రమనియెడి రత్నము శోభింపకమానదు. ఈ నివురును దొలగించిన నాగులచరిత్రమనియెడి నిప్పు