పుట:Andhrula Charitramu Part-1.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తకాలమున కార్యులు కొందరు వచ్చి యీకర్ణాటులతో గలసి తమ ప్రాకృత సంస్కృతములను వారి కర్ణాటక ద్రావిడములను గలిపి రూపభేదములతో వ్యవహిరించు కొనుటంజేసి వారి భాషయంతయు గర్ణాటంబనియె వ్యవహరింపబడుచుండెను. ఈ కర్ణాటకాంధ్రులే క్రమక్రమముగా గొందరాంధ్రదేశముకు వచ్చి యాంధ్రులలో గలిసిపోయిరి.

ఆంధ్రులార్యులా, అనార్యులా, ద్రావిడులా ?

ఆంధ్రు లాదిమనివాసులో ద్రావిడులో ఆర్యులో మనము నిశ్చయముగా జెప్పజాలముకాని యైతరేయ బ్రాహ్మణమునందు నాంధ్రులు విశ్వామిత్రుని సంతతి వారనియు, వానిచే శపింపబడి నారనియు జెప్పబడియుండుట చేత, యార్యాశ్రమముల యొక్క సరిహద్దుల నివసించుచుండినారనియు, జెప్పబడియుండుటంజేసి యీ యాంధ్రులు ఉత్తరదేశములోని యార్యులతో బోరాడి లేచి వచ్చి దండకారణ్యములోని యనార్యజనమధ్యమున సంచరించెడి యొక తెగవారైన యార్యులుగా గొందరు తలచుచున్నారు. ఆంధ్రులను పులిందుల తోడను శబరులతోడను జేర్చియుండుట చేతను వీరాదిమవాసులైన యనార్యులేమో యని కొందరు తలంచుచున్నారు. అనేకవిధముల ద్రావిడులతో విశేష సంబంధముతో గన్పట్టుచుండుట చేత వీరలు ద్రావిడులని మరికొందరు తలంచుచున్నారు. ఆంధ్రశబ్ధము యొక్క వుత్పత్తిని బట్టి చూచిన మొదటి యభిప్రాయము సరియైనదేమోయని తోచుచున్నది. మనుష్యులు నివసించుటకు సాధ్యముకాక యంధకారబంధురముగా నుండు మహారణ్య ప్రదేశమున కంధ్రమని యార్యులు పేరిడియుందురు. ఈ ప్రదేశమున మొదట ననార్యులే నివసించి యుండిరి. తమతెగవారు వెడలివచ్చి యీ యరణ్యప్రదేశము ననార్యజన మధ్యమున నివసించియుండుట చేత నార్యులు వీరికి నాంధ్రులని పేరుపెట్టి యుండవచ్చును. ఆంధ్రు లార్యులయినను ననార్యులైనను పేరుమాత్రమార్యులచే నీయబడినదనుట స్పష్టము. ఈయార్యాంధ్రులు తమతో బోరాడి

[1]

  1. Dr. Bhandarkar's Early History of Deckhan p.2