తరువాతవచ్చిన వారు రెండవతెగవారు "తిరయార్" అను సాగరకులులు. వీరు సముద్రము మీద బ్రహ్మదేశము (బర్మాకును)నకును, కొచ్చిన్ చీనాకును, సింహళముకును (లంకాద్వీపము) దక్షిణ హిందూదేశముకును వచ్చి యుండిరి. ఈ తెగలో చేరిన తిరయా నను రాజొకడు కరికాలచోడునితో సమకాలికుడై కాంచీపురమనియెడి కంచిని పాలించెను. ఈతడు తాను విష్ణ్వాంశ సంభూతుడ నని చెప్పుకొనియుండెను. ఇందుచేతనే కాబోలు నా తెగలో జేరిన చోళరాజులు తాము సూర్యవంశజులమని గరువముతో జెప్పుకొనియుండిరి. ముచ్చుకుంటు డనునతడు చోళరాజులలో ప్రాధమికుడుగా తమిళ కావ్యములందు బేర్కొనబడియెను. అసుర లింద్రుని రాజధానియగు యమరావతిని సంరక్షించెను. తనకుజేసిన యుపకారమునకు బ్రత్యుపకారముగా నింద్రు డయిదుగురు రాక్షసులను బంపగా వారలు కావేరీ పద్దినములోని (కావేరీపట్టణము) నాగులనుసంహరించి పట్టణమును చోళరాజుకు వశపరచిరి. తమిళులాపట్టణమునకు చంపాపతి అని పేరు పెట్టిరివంగదేశమునకు చంపానగరము రాజధానుగ నుండెను. ఆ పేరునే వీరచ్చటిపట్టణమునకు బెట్టిరని యూహింపబడుచున్నది. తొండైమండలమును బాలించిన పూర్వరాజులు సాగరకులులకు సంబంధించిన వారుగా నుండిరి.కానీ ఇటీవలి పల్లవులు తాము భారద్వాజులమని చెప్పుకొనుచుండిరి. ఇప్పటి చెంగలుపట్టు ఉత్తరార్కాడు మండలములే తొండైమండలముగా నాకాలమున బ్రసిద్ధివహించి యుండినవి. ఈ తిరయార్ తెగలోని కుటుంబము లయిదు వేర్వేరు నామములతో బిలువబడుచుండినవి. వంగదేశపు తిరయారులు పౌంగల తిరయారులని, చీనాదేశపు తిరయారులు చీనాతిరయారులని, కడరం (బర్మా) తిరయారులు, కడరతిరయారులులనియు, సింహళ ద్వీపతిరయారులనియు, పల్లవము తిరయారులనియు, పదునారవ శతాబ్ధము వరకు బిలువంబడుచుండిరి. తిరయారులకు వెనుకవచ్చిన వారు వనవారు లనెడి తెగవారు. వీరిని స్వర్గము నుండి వచ్చినవారనియెదరు. వీరు వంగదేశమునందలి యుత్తరపర్వత