పుట:Andhrula Charitramu Part-1.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దఱిమి గొట్టెను. అంతట నూరకొనక యావాడిమగం డాంధ్రదేశంబున దనయధికారమును స్థాపించి తనపినతండ్రి తనకు జేసిన యుపకారమును మన్నించి యా విజయాదిత్యునే వేగిరాజ్యమునకు రాజప్రతినిధిగ బునరభిషిక్తునిగావించి తనమాతామహునిదైన చోడరాజ్యమును బాలించుచుండిన వీరరాజేంద్రుడు మరణము నొందెను. రాజ్యాధిపత్యముకొఱకు దేశమున బెద్దకల్లోలము జనించెను. ఈ సమాచారమును దెలిసికొన్నవాడై వీరరాజేంద్రుని యల్లుడును కుంతలరాజు నగునాఱవవిక్రమాదిత్యుడు కాంచీపురముపై దాడివెడలి వచ్చి తన భార్యతోబుట్టువగు కేసరివర్మకు బట్టముగట్టి యొక మాసమువఱకచ్చట నుండి కలహములనడచి మరల రాష్ట్రమునకు బోయెను. అతడు మరలిపోయిన వెనుక శీఘ్రకాలములోనే రాజ్యమున మరల గల్లోలము ప్రారంభమయ్యెను. తనమాతామహుని రాజ్య మాక్రమించుకొనగోరి రాజరాజనరేంద్రుని తనయుండగు రాజేంద్రచోడుడు వీరరాజేంద్రతనయుండగు పరకేసరివర్మను జంపి రాజ్యామాక్రమించుకొని కులోత్తుంగ చోళదేవుడనుపేరుతో బట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు క్రీస్తుశకము 1070 దవ సంవత్సరముమొదలుకొని 1118వఱకు గొంచముతక్కువగ నేబది సంవత్సరములు కళింగవేంగిచోడరాజ్యములను నిరాతంకముగా బరిపాలనము చేసెను. ఇతడు తనబావమరిదిని జంపి చోడరాజ్యమును వశపఱచుకొనుట జూచి సహింపజాలక కుంతలరాజగు విక్రమాదిత్యుడు దండెత్తివచ్చెను గాని మార్గమధ్యమున గులోత్తంగునిచే నెదుర్కొనబడి యుద్ధముజేసి యపజయములను గాంచి మరలపోయెను. బిల్హణకవివిరచితమై విక్రమాదిత్యుని కంకితము చేయబడిన విక్రమాంకడేవచరిత్రమునందును విక్రమాదిత్యునిశాసనములయందు కులోత్తుంగుడే యోడిపోయినట్లు చెప్పియున్నను కులోత్తుంగుని శాసనములు కులోత్తుంగునికే జయముగలిగినట్లుగ జాటుచున్నవి. కులోత్తుంగదేవుడే యోడుటసంభవించెనేని విక్రమాదిత్యుడు వేంగిచోడదేశములను మ్రింగివేసియుండును. అట్లుజరిగియుండక పోవుటయెవిక్రమాదిత్యునికి సంపూర్ణవిజయములు కలిగియుండలేదనుటకు నిదర్శనము