పుట:Andhrula Charitramu Part-1.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది 12, 13, 14 శతాబ్దములలో ధాన్యవతీపురమనుపేరను బిలువంబడు చుండెనని శాసనములు కూడ రూఢిఫఱచుచున్నవి. శాలివాహనశకము 1293 వ సంవత్సరమున కు సరియైన క్రీస్తుశకము 1391 వ సంవత్సరమున అమరావతీ గ్రామమునందలి యమరేశ్వరాలయములలోని యొక శాసనములో శ్రీ ధాన్యవతీపురమని తెలుప బడినది. మఱియును కృష్ణామండలములో నూజివీడు తాలూకా లోని యెనమదల గ్రామములో నొక ఱాతిబండపైనుండు శాసనములో గూడ ధాన్యవతీపురమనియె చెప్పబడినది. [1] ఈ ధాన్యకటకమను శబ్దము టిబెట్ దేశ గ్రంథములలో " ద్పల్ -ల్దాస్ -బ్రాస్-స్ప్రూయిన్‌సు"(Dpal-Idan-brasspruius) అని భాషాంతరీకరింప బడినది. అనగా ధాన్యరాశు లధికముగా గలపట్టణమని యర్థమట. ఈ పట్టణమునందే గొప్ప చైత్యమున్నదని యాదేశ చరిత్రమును వ్రాసిన తారానాథుడు నుడువుచున్నాడు. ఈపై వృత్తాంతములను బట్టి ధాన్యకటకమను పేరు నిజమైన పేరుగా గన్పట్లుచున్నదనుటకు సందియములేదు. చీనాదేశపుయాత్రికుడగు హౌనుత్సాంగు ధాన్యకటకమును వర్ణించిచెప్పిన విషయములనుబట్టి ధాన్యకటక నగరముండిన ప్రదేశము ధరణికోటయగునా కాదాయని పాశ్చాత్యపండితులలో గొందఱు విశేషముగా జర్చించిరి. ధాన్యకటకము ధరణికోట కాదనియు, విజయవాడ (Bezwada) యనియు వాదించిన వారిలో రాబర్టు స్యూయలు గారు ప్రాముఖ్యతను గాంచియున్నారు. వీరు హౌనుత్సాంగు చేసిన వర్ణన నాధారపఱచుకొనియో వాదించుచున్నారనుటకు సందియుము లేదు గాని సంగతి సందర్భములన్నిటిని చక్కగ నాలోచించి చూచిన పక్షమున విజయవాడ గాక ధరణికోటయే ధాన్యకటకనగరమని చెప్పుటకు ప్రబలహేతువులు కలవని పెక్కండ్రు చరిత్రకారులు తలంచుచున్నారు. హౌనుత్సాంగు ధాన్యకటకమునకు దూర్పున బూర్వశైల సంఘారామమును పశ్చిమమున నపరశైల సంఘారామమును గలవని పేర్కొనియున్నాడనియు అయ్యవి పర్వతములకు జేరియున్నవని చెప్పియున్నాడనియు, అపూర్వశైల సంఘారామమె బెజవాడకు దూర్పుననున్న కొండపైనున్నదనియు, అపర

  1. See. Mr. Mackenzie's Kistna District Manual.