పుట:Andhraveerulupar025958mbp.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమనాద్రి యెక్కినయశ్వము సంగర రంగములలో బాగుగా మెలగనేర్చినది. పిట్టవలె నంతలో విరోధిసైన్యములమధ్య వ్రాలును. ముందుకాళ్లెత్తి యేనుగులమీదికి బోవును. ఈయశ్వము నెటులేని బట్టి తెప్పించినచో సోమనాద్రి చిక్కగలడని నిజాము ఆలీ తలంచెను. తనసైనికులతో సోమనాద్రి గుఱ్ఱమును గొనివచ్చినవానికి గొన్నిగ్రామము లిచ్చెదనని చెప్పెను. ఎవరును సాహసించి యందుల కియ్యకొనరైరి. నిజాముఆలీ యశ్వపాలకు డందుల కంగీకరించి గాఢాందకారమున బయలుదేరి యెటులో యశ్వశాలకుబోయి గుఱ్ఱమును లాయమునుండి తొలగించి తన శిబిరము త్రోవ బట్టించెను. రెడ్డివీరులంద ఱిదిచూచి యెవడో మన భటుడె కార్యాంతరమున వేగునడుపుటకు బోవుచుండెనని యుపేక్షించిరి. అశ్వపాలకుడు కొలదిసేపటిలో నిజాము ఆలియొద్దకు జేరి యశ్వమునుజూపి తనవిజయవార్త నెఱింగించెను. నిజాము ఆలీ యశ్వమును లాయమున గట్టివేయించి వానిని సత్కరించెను.

నవాబు పట్టరాని యానందము నొంది సోమనాద్రిని బట్టుకొనుట యిక సులభమని ప్రజ్ఞలు కొట్టుచుండెను. సోమనాద్రి తెల్లవారిచూడగా అశ్వము లేదయ్యెను. చాలవిచారించి యడుగుజాడలవలన నిజాముఆలీ శిబిరము చేరినటుల గ్రహించి విచారపడెను. కొనివచ్చిన వానికి గోరినంత ధన