పుట:Andhraveerulupar025958mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసరాజు సాళ్వ నరసింహరాజుపుత్రులలో బెద్దవానికి రాజ్యము నొసంగి తాను వ్యవహారముల జూచుచుండెను. నరసరాజువిరోధు లాతనియెడల నెపము గలిగింపనెంచి బాలరాజును జంపించి యాదురంతము నరసరాజునెడ నారోపించిరి. నరసరా జానింద దొలగించుకొనుటకు నరసింహరాజు రెండవ కుమారునకు విద్యానగర రాజ్యమును పట్టాభిషేకము గావించి రాజకీయ వ్యవహారములు తాను సవరించు చుండెను. నరసరాజు శ్రేయమునకు సహింపని దుష్టులగు కొందఱు రాజకీయోద్యోగులు బాలరాజునకు లేనిపోని కొండెములు చెప్పి "నీయన్నను జంపించినటుల నిన్నుంగూడ నరసరాజు చంపింప నున్నా" డని వీలువెంట నూరిపోసిరి. ప్రపంచజ్ఞానశూన్యుడగు నాబాలు డామాటల నమ్మి నరసరాజును ద్వేషింప మొదలు పెట్టెను. ఇంక నుపేక్షించిన బాలరాజు తన కపాయము చేయుటయేగాక విద్యానగరరాజ్యమును గూడ గొలుపోక మానడని తన పలుకుబడి నుపయోగించి సైన్యమునంతయు గూడగట్టుకొని యాతని బంధించి పెనుగొండదుర్గమున నుంచి ఆహారాదులకు స్వల్పభరణము నొసంగసాగెను. కొంతకాల మెటులో గడపి బాలరాజు మరణించెను. తుళువరాజు ప్రత్యర్థులగు నుద్యోగుల నందరను దొలగించి సామ్రాజ్యమును బునరుద్ధరించి యమితవిఖ్యాతి గడించెను.

సాళ్వనరసింహరాజు క్రీ.శ. 1490 ప్రాంతమున మరణించెను. ఈయన కాలమునుండి విద్యానగరము ఆంధ్ర