పుట:Andhraveerulupar025958mbp.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ను బరిపాలించెను. ఇతనిశాసనములు నిజామురాష్ట్రము లోని యయ్యనవోలు, దేవరకొండ, రాచకొండ లోనగు చోటుల కానవచ్చు చున్నవి.)

________

సాళ్వ నరసింహరాజు.

బుక్కరాయల యనంతరము విద్యానగర సామ్రాజ్యమును(రెండవ) హరిహరరాయులు, మొదటి దేవరాయలు, ప్రౌడ దేవరాయలు, మల్లికార్జునరాయలు, విరూపాక్షరాయలు వరుసగ బాలించిరి. వీరిలో బ్రౌడరాయలు చిరకాలము రాజ్యము తన పూర్వులకు సమానముగా బాలించి మితిలేని ధనము భాండాగారమున జేర్చి క్రీ.శ. 1446 ప్రాంతమున మరణించెను. ప్రౌడదేవరాయలకు పొన్నలదేవివలన మల్లికార్జునరాయలు, సింహలదేవి వలన విరూపాక్షరాయలు జనించిరి. మల్లికార్జునరాయలు తనపూర్వులు సంపాదించిన రాజ్యమును జాగరూకతతో గాపాడుకొనుచుండెను. ఒక్క ప్రక్కను మహమ్మదీయులు పూర్వ వైరమును బురస్కరించుకొని కర్ణాట సామ్రాజ్యమును కబళింప నుండిరి. కటకపాలకుడగు కపిలేంద్ర గజపతివిస్తారమగు బలమును సమకూర్చుకొని ఆంధ్రదేశమునందలి ప్రసిద్ధ దుర్గముల నన్నిటిని లోబఱచికొని విద్యానగరమును ముట్టడించెను. మల్లికార్జునరాయలు ఘోరసంగరము చిరకాలము