పుట:Andhra bhasha charitramu part 1.pdf/733

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. నెలకొను సంస్కృత తత్సమ
   ములు దొరలక తజ్జదేశ్యముల మూటను సం
   ధిలికేవలాంధ్రములునా,
   నలరు గృతుల నచ్చతెలుగులండ్రు తెలుగునన్.

కావ్యములలో సంస్కృత మాదిగా గల భాషలనుండి పదముల కుప్పలుకుప్పలుగా నుపయోగించుట కలదుగాని సాధారణ సంభాషణలో నట్టి పదములు చాల దక్కువగనే యుండును. పండితు లైనవారు మాటలాడునపుడు గూడ నుపన్యాసములయందు దప్ప దత్సమతద్భవములు సాధారణముగ దొరలనే దొరలవు. ఈ విషయమున గూర్చి పరిశీలించు బుద్ధి పుట్టి యిరువురు పండితులు సంభాషించుకొనుచుండగ రాత్రి యెనిమిదిగంటల నుండి పండ్రెండుగంటలవఱకు వింటిని. ఈ నాలుగు గంటలకాలములో వారుపయోగించినమాటలలో 42 తత్సమతద్భవములు, 6 ఇంగ్లీషుపదములును, 8 హిందూస్థానీపదములును దొరలినవి. తక్కిన వన్నియు దేశ్యపదములే. కోర్టువ్యవహారముల గూర్చి వారు మాటలాడుచుండుటచే నీ యింగ్లీషు హిందూస్థానీపదములు వచ్చినవిగాని లేనిచో నవియు రాకయుండు నేమో- ఏది యెట్లున్నను దేశ్యపదములను సర్వసాధారణముగ వాడుకొనుటయు దక్కినపదముల నంత సాధారణముగ వాడుకొనకపోవుటయు నిర్వివాదాంశము. గ్రంథస్థ మగుభాషయందు గూడ దేశ్యపదములే చాల నెక్కుడుగ నుండుననుటకు సందేహములేదు. దీనికి నిదర్శనముగ మహాకవుల గ్రంథములనుండి దిజ్మౌత్రముగ గొన్ని పద్యములనెత్తి వానియందలి సంస్కృత సమసంస్కృత సమేతరపదముల లెక్కపెట్టి చూతము.

నన్నయభట్టు.

మ. కురువృద్ధు ల్గురువృద్ధబాంధవు లనేకు ల్సూచుచుండ న్మదో
    ద్ధురుడై ద్రౌపది నట్లు చేసినఖలున్ దుశ్శాసనున్ లోక భీ
    కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైల రక్తౌఘ ని
    ర్ఘర ముర్వీపతి చూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్.
             భార. సభా. 2. [27 సంస్కృతము, 19 తెనుగు.]

తిక్కన.

శా. ఏమీ! పార్థుడు నీవు దండిమగలై యీవచ్చు కౌరవ్య సం
   గ్రామక్షోభము బాహుదర్పమున దీర్పన్ బెద్ద మిఱ్ఱెక్కి మి
   మ్మే మెల్లన్ వెఱ గంది చూచెదము గా కీనారికిం బోయి రా
   భీముం డిత్తఱి రిత్తమాటలకు గోపింపండు సూ పెంపఱన్.
                          ఉద్యో. అ. 3. [7 సం, 40 తె.]