పుట:Andhra bhasha charitramu part 1.pdf/719

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాత నీమండలమును చోళులు పాలించిరి. చోళసముద్రం, చోళేమర్రి, అనుపేరులు చోళరాజులనుండి వచ్చినవి. చౌళూరు గూడ అట్టిదే అయియుండును. కాని ఆపేరికి వ్యుత్పత్తి వేరు విధముగా ఈ వ్యాసమునందే ఇంకొక చోట సూచింపబడినది.

తర్వాత, పడుమటి చాళుక్యు లీమండలము నాక్రమించుకొనిరి. గుత్తి కోటలో 1076 నుండి 1126 వరకు నేలిన 6-వ విక్రమాదిత్యుని శాసనమున్నది. త్రిభువనమల్ల విక్రమాదిత్యుడని ఆతనిపేరు. మల్లాపురము, మల్లాగుండ్ల, మల్లాకాల్వ, మల్లాపల్లి, మల్లేనిపల్లి, మల్లేపల్లి ఈ గ్రామము లాతని పేరిటవైయుండును.

తర్వాత 12-వ శతాబ్దములో హొయిసలులు వచ్చిరి. గుత్తిని జయించిన వీరబల్లాళుడు (1191-1213) వీరాపురమునకు తనపే రుంచియుండును.

తర్వాతిరాజులు యాదవులు. యాదవరాజు శింగన్న (1210-1247) శింగనమల, శింగనగరము, యెఱ్ఱ శింగేపల్లి, యను వీనికి తనపేరు నుంచెను.

తర్వాతముహమ్మదీయులు ఈ ప్రాంతమున జొరబడిరి. కాని ఆ కాలమున వారిపేరిట ఏ గ్రామములును నిలువలేదు. అప్పుడు ఓరుగంటి కాకతీయుల ఏలుబడిలో నీ మండల ముండినది. రుద్రాంబరాణిపేరిట రుద్రంపేట పేరు వచ్చియుండును. ఓరంగల్లు ముహమ్మదీయుల వశమైనతర్వాత విజయనగర హిందూసామ్రాజ్యము వన్నె కెక్కెను.

విజయనగరచరిత్రయే అనంతపురమండల చరిత్రమనికూడ చెప్పవచ్చును. ఈ రాజుల పాలనమున ఈ మండలములోత్రవ్వబడిన చెఱువుల పేర్లన్నియు, విజయనగర రాజులయు రాణులయు సరదారులయు పేర్లనుబట్టివచ్చినవే. రాయలసీమ అని పిలువబడుటకు అనంతపురమండలమే మిక్కిలి అర్హమైనది. సామ్రాజ్యముఖ్యపట్టణము బళ్ళారిమండలములో నుండిననుకూడ అనంతపుర మండలములోని గ్రామములకును చెఱువులకును ఆ రాజవంశీయుల పేర్లు నిలిచినట్లు బళ్ళారిమండలములో నిలువలేదు.

విజయనగరరాజులలో మొదటివాడు బుక్కరాజు; అతనిపేరిట బుక్క పట్టణము, బుక్కాపురము, బుక్కచెర్ల, బుక్కరాయ సముద్రము అనునవున్నవి. అతనిమంత్రి అనంతరసు. అనంతపురనామ మీమంత్రినిబట్టియే వచ్చినది. ఇట్టి పేరులు మూడీమండలమున నున్నవి. ఒక్కటి మండల ముఖ్యపట్టణముమగు అనంతపురము. రెండవది మడకశిరా తాలూకాలోను, మూడవది గుత్తి తాలూకాలోను నున్నవి కల్యాణదుర్గం తాలూకాలోని రాళ్ళ అనంతపురము గూడ ఈ మంత్రి పేరిట వచ్చినదేయై యుండును. హండే అనంతపురము చరి