పుట:Andhra bhasha charitramu part 1.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii. చెన్న రాజధానిలోని భాషలు.

చెన్నరాజధానిలో తమిళము, మళయాళము, తెనుగు, కన్నడము, తుళు, హిందూస్థానీ, అను వ్రాతగలభాష లాఱున్నవి. వీనిలో తెను గన్నిటికంటె సుస్వరితమును, శ్రావ్యమునునై యున్నది. దీని నైరోపా భాషలలోని 'ఇటాలియను' తో బోల్చుట సరిగనే యున్నది. కాని, కొన్ని ఇటాలియను ఉపభాషలు చెవి కసహ్యముగా నుండునట్లే, తెలుగున గూడనన్ని యుపభాషలును నొక్కరీతిగనే శ్రావ్యముగ నున్నవని చెప్ప వీలులేదు.

iV. తెలుగు భాషకు సరిహద్దులు.

(అ) I. తెలుగు-ఒఱియా సరిహద్దు:- గంజాము జిల్లాలోను, విశాఖపట్టణము ఏజెన్సీలోను కొన్ని ప్రదేశములలో రెండు భాషలును సరిసమానముగ నూటికేబది వంతున నున్నారు; కొన్ని ప్రదేశములలో రెండు భాషలును నూటికేబదివంతులు పొందియుండలేదు. సముద్ర ప్రాంతమందెల్ల తెనుగువా రుండుట గమనింపదగినది. ఋషికుల్యా ముఖద్వారము వఱకు దెనుగువారున్నారు. కొన్ని రీతులుగ ఋషికుల్యా నదియు, దాని యుపనదులును ఒఱియా భాషకు దక్షిణపు టెల్లయని చెప్పవచ్చును. ..... విశాఖపట్టణము ఏజెన్సీలో నౌరంగపూరు ఉత్తరభాగము, జయపురము, కో--పుట్టి తాలూకాలలో ఒఱియాభాషయే ప్రధానమైనదన వలెను; కాని, యిచటగూడ నాభాష కోయమొదలగు భాషల ప్రదేశము నాక్రమించుచున్నదనియే చెప్పవలెను. ... విశాఖపట్టణము ఏజెన్సీకి దక్షిణముగ నచ్చు గొలదిని తెనుగుభాష ప్రబలమగుచున్నది, గూడెమ్, నిరవల్లి తాలూకాలోను పాడ్వాతాలూకా దక్షిణమునను తెనుగె ప్రధానభాషయని చెప్పవలెను.

(ఆ) II. తెలుగు - కన్నడముల సరిహద్దు:- ఈ యెల్ల ఉత్తరమున హగేరీ నదియు దాని యుపనదియగు చిన్న హగేరీయు నని చెప్పవచ్చును. మడకసిరా తాలూకా పశ్చిమభాగము కొంచెము తప్ప అనంతపురము జిల్లా యంతయు తెనుగు దేశమందే చేరుచున్నది. ఇచట తెనుగు సరిహద్దు మైసూరు సంస్థానములోనికి చొచ్చుకొని పోవుచున్నది. ఆ సంస్థానములోని కోలారు జిల్లాలోని జనులలో మూడువంతులలో రెండువంతులమంది తెలుగే తమ మాతృభాషగా చెప్పికొని యున్నారు. ఈ ఎల్ల హిందూపురమునుండి కుప్పమువఱ కున్నదని చెప్పవచ్చును; కాని, యీ విషయము మైసూరు జనాభా లెక్కలవలన నిర్ణయము కావలసియున్నది. ఈ యెల్ల సేలము జిల్లాలోని హోసూరు తాలూకా ఉత్తరపుభాగమును కోసికొనిపోయి, పుత్తూరు, చిత్తూరు, తిరుత్తని తాలూకాలలో దక్షిణభాగములను తెనుగు ప్రదేశమున జేర్చుచు, చిత్తూరు - ఉత్తరార్కాడు జిల్లాల సరిహద్దు ననుసరించి, చెంగల్పట్టు జిల్లాలోని తిరువళ్లూరు, పొన్నేరి తాలూకాలను తెనుగుదేశమున జేర్చుచు, పులికాడు సరస్సునకు దక్షిణమున సముద్రమును గలియుచున్నది.

(ఇ) III. తెలుగు - అరవముల సరిహద్దు:- దక్షిణమున అరవదేశములో తెనుగున కెల్లను నిర్ణయింప వీలులేదు. తూర్పు-పడమటి కనుమల మధ్యమునందెల్ల తెనుగు కొలదిగనో గొప్పగనో వ్యాపించి యున్నది. దక్షిణ ఆర్కాడు దక్షిణపు తాలూకాలలోదప్ప, తంజావూరుజిల్లా, పుదుక్కోట సంస్థానము, రామనాథ, శివగంగ జమీందారీలు, తామ్రపర్ణీ నదికి దక్షిణముననున్న తిరునల్వేలిజిల్లా,- ఇచట నచట నన నేల, దక్షిణదేశమందెల్లెడల తెనుగు మాతృభాషగా వినవచ్చు చున్నది. ఈ యెల్ల ఒక మార్గమును పట్టలేదు; కాని, రెండు విషయములుమాత్రము గమనింప దగినవి - (i) మిట్ట ప్రదేశము ననుసరించుట (ii) రాయల సీమలోని నల్ల రేగడభూముల నాశ్రయించుట. తూర్పు తీరమునను, నదీముఖద్వారములను తెనుగు లేదు. తిరునల్వేలి, రామనాథ జిల్లాలలోని కనుమలకు తూర్పుననున్న ఎఱ్ఱమట్టి భూములలో తెనుగువారు పలుచగను, సత్తూరు, శ్రీవిల్లిపుత్తూరు, శంకర నారాయణర్ కోవిల్, కోవిల్