పుట:AndhraRachaitaluVol1.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నోయీ" యని సమాధానము చెప్పెను. వర్తకుడు భాగవతము తీసి బాల నారాయణదాసును బఠింపుమనెను. అతడు గణగణ తడువుకొనకుండ రాగధోరణలో జదివెను. ఇటులే మఱొకఘట్టము, మఱొక ఘట్టముగా సాహుకారు పిల్లవానిచే జదివించి విని బ్రహ్మానందపడి, భాగవతపు బ్రతియేకాక మరియొక యైదురూపాయ లుపాయనముగా గూడ వానిచేతిలో బెట్టెనట. ఆబేహారి 'రంగయ్య' పేరు వేఱొకతూరి స్మరించు కొందము. పసినాట మాతౄపదేశము, భాగవతసందేశము గుండియలకు బట్టించుకొనియే నారాయణదాసు క్రమముగా కళాప్రపూర్ణుడై వాసికెక్కినాడు.

దాసుగారికి సహజముగ నాటపాటలయందు మేటి యాసక్తి మోసులెత్తినది. అయిదాఱేండ్ల యీడునకే కళాబీజములు పొటమరించినవి. విజయనగర మహారాజుగారి రాజకీయాంగ్ల పాఠశాలలో నాంగ్ల విద్యాభ్యాసమునకు విఘ్నేశ్వరపూజ జరిగినది. ఆనాటికి వీరివయస్సు పదునాఱు సంవత్సరములు. 1886 లో 'మెట్రికులేషన్' పరీక్షయందు నెగ్గి ఎఫ్.ఏ. విశాఖపట్టణము ఏ.వి.యన్ కళాశాలలో జదువుకు మొదలిడిరి. 1888 సం|| ఎఫ్.ఏ పరీక్ష వీరిని తప్పించినది. అంతతో దానికి స్వస్తి. నిర్బంధపఠనము వదిలిన పిదప ఆంగ్లములో నెన్నో మెలుకువలు, మఱుగులు గుర్తించుటయేగాక పారసీకము, అరబ్బీ, ఉర్దూ, సంస్కృతము చదివి తన పాండితికొక క్రొత్తవన్నె తెచ్చుకొనెను.

తొలుతనే ముచ్చటించవలసిన విషయమొకటి యిప్పుడు జ్ణప్తికి వచ్చుచున్నది. అసలు, తల్లిదండ్రులిడిన నామకరణమువీరికి 'సూర్యనారాయణ' యని. "నారాయణదాసు" అనుటయేకాని యాపేరు చాలామంది యెఱుగరు. వారిబంధుకోటిలో మాత్రము 'సూరన్న' యని పిలుచుట వాడుక. 'దాసు' అనునుత్తరపదముతో గూడిన వ్యవహారము 1886 సం|| నుండి తెలుగునేలలో మంచి ప్రచారములోనికి వచ్చినధ్మి నారాయణదాసుగారి 'హరికధా' కల్పవృక్షమునకు బ్రాకుడుగొను