పుట:AndhraRachaitaluVol1.djvu/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్రోయలేని నీరవగళ

మున జరించు కోరికతో

ఇపుడా నను బలుకరింతురు!

ఎవరని ఈరేయి నిదుర

హృదయ మదర, వేయి జేయి

చాయలాడ పెనుచీకటి

సైగలతో నాకన్నుల

రక్తమురల లాగికొందురు!

        *           *            *            *

ఇది మున్నుగా నెన్నో కృష్ణశాస్త్రిగారి పాటలు ప్రశస్తి గొని యున్నవి. " జయజయజయ ప్రియభారత జనయిత్రీ! " " యువపతాక నవ పతాక, అరుణారుణ జయపతాక" ఈ పాటలు గానము చేయని సభలు నేడు తక్కువ.

అభినవాంధ్ర కవులలో నొక ప్రత్యేకత సంపాదించుకొన్న దేవులపల్లి కవి పరసేవాహైన్యము ననుభవింపలేని ఆత్మగౌరవశీలి అయినను 1932 మొదలు 1941 దాక పి.ఆర్. కాలేజీలో ఉపన్యాసక పదవిలో నుండవలసి వచ్చినది. వెనుకటి యుద్యోగముల వలెనే యీపదవికూడ స్వాతంత్ర్య మారుతము ధాటి కాగలేక పోయినది. ఆతరువాత కృష్ణశాస్త్రిగారి మనుగడ మదరాసులో. 'మల్లేశ్వరి' మొదలగు చలన చిత్రములకు పాటలు, మాటలు వ్రాసి యిచ్చుచు, రేడియోలో నాటికలు ప్రసారముచేయుచు గాలక్షేపము. చిన్న చిన్న కావ్యములేవో కొన్ని రచించి, యొక రకమైన కవితాపథమునకు దర్శకత్వము సంపాదించెనే కాని, కృష్ణశాస్త్రిగారు రెద్దకము వేసికొని మహాగ్రంథమేదియు వ్రాయలేకపోవుట యొకకొదవ యని కొందఱి విమర్శ.