పుట:AndhraRachaitaluVol1.djvu/524

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిఫల మ్మినుమంత వలవక కర్మముల్

సేయు నీమెయి కురుక్షేత్ర మగును,

ఆశాంతములకు జరాచరమ్ములకును

దరలు నీయెడద బృందావనమగు,

వివిధ ధర్మజ్ఞానవేణీ సమాశ్లేష

మైన నీమనసు ప్రయాగ యగును,

పాతాళమును స్వర్గపద మొక ముడిలోన

నతుకు నీవే వారణాసి వౌదు

నీవు కన్పడ నెదురుగా నిలిచినట్లె

మ్రోలను పురాణ భారత పుణ్యభూమి!

మాకు దినదిన దివ్యయాత్రా కృతోత్స

వానుభూతి నొసంగు బ్రహ్మర్షి నీవు.

గురువునెడల దేవులపల్లికవి భక్తిప్రపత్తుల కే కాక, ఆధ్యాత్మిక దృష్టి నైశిత్యమునకు గూడ నీరచన తారకాణ. కృష్ణశాస్త్రిగారిలో నొక విశేషమున్నది; వీరి భావన మృదుల మృదలముగా నుండి లోతుల నంటుకొనును. ఆ పలుకుల మెత్తదనము హాయి యనిపించును. ఎంతసేపు, కవికి శైలిపై చూపు. ఆయనపాట లందుకే తెనుగునాట ముచ్చటగా బాడుకొనుచుందురు.

ఎవరోహో, ఈ నిశీధి

నెగసి నీడవోలె నిలిచి

పిలుతు రెవరొ, మూగకనులు

మోయలేని చూపులతో

ఎవరోహో! ఎవరోహో!

ఇపుడా నను బలుకరింతురు!