పుట:AndhraRachaitaluVol1.djvu/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేయికడుపున చీకటి చాయవోలె

తమపు టెడద దివాంధగీతము విధాన

ఘాక రావాన వలవంతరేక రీతి

నా విషాదమ్ములో దాగినాడ నేనె!

దేవులపల్లి కవితాగానము ముప్పాతికపాలు కరుణాత్మకము. కరుణలోనే మధురిమ నించి పాఠకుల నూరింపజేయు శక్తి ఆయన కలములో దులకాడుచుండును. దేవులపల్లి కవి యీత్రోవ నవీన కవులెందఱో యనుసరించినారు. "కవి మృతుడైనను చనిపోవరా" దని కృష్ణశాస్త్రిగారి వాణి. బ్రతికియుండియు మరణించుచున్న - జీవఛ్ఛవములైన కవులను జూచి కృష్ణశాస్త్రిగారికి జాలి. రవీంద్రుని యడుగు జాడలలో వీరినడక. తెనుగు కవులలో నన్నయ - రామకృష్ణుడు ఇత్యాదులు కొందఱే యాయన దృష్టిలో మహాకవులు. జయదేవుడు, అమరకుడు, కాళిదాసు, భవభూతి వీరిపేళ్లు చెప్పి కృష్ణశాస్త్రిగారు పొంగిపోదురు. వేంకటరత్నము నాయుడుగారు గురుస్థానము. ఆయనమీద గొప్ప హృదయముతో నీయన రచించిన పద్యములు భావింప దగినవి; విస్మరింప రానివియును.

ఈ జడజీవితమ్ము పలికించితి, వీ యఘవంకమందు సం

భోజము మొల్వజేసితి, వపూర్వము నీదయ, యీనిశీధి నీ

రాజన మెత్తినావు, విపులమ్మగు నీయెద నిండెనే శర

ద్రాజిత చంద్ర కాంతు లమృతమ్ములు స్వర్గలతాంత వాసనల్.

              *

నాయెదలో ద్వదీయ చరణమ్ముల చిహ్నము లెన్న డేనియున్

మాయన, యేనిశీథవు దమస్సులు మాసినగాని జీవయా

త్రాయత వీథి నొక్కడ బ్రయాణము సేయుదు నక్షయంపు బా

థేయముగా గ్రహించి గురుదేవముఖస్రుత గీతికానుధల్.

                *