పుట:AndhraRachaitaluVol1.djvu/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పసిడి వేకువ పెండ్లిండ్ల బడిన యెవరు

కరగనేర్తురు జరఠాంధకారమృతికి?

నామరణశయ్య పఱచుకొన్నాను నేనె!

నేనె నాకు వీడ్కొలువు విన్పించినాను!

నేనె నాపయి వాలినా, నేనెజాలి

నెద నెద గదించినాను, రోదించినాను.

బ్రతికియున్న మృత్యువునైన ప్రవాస తిమిర

నీరవ సమాధి గ్రుక్కి క్రుంగినపుడేని

నిను పిలిచినాన, నామూల్గు నీడ ముసిరి

కుములునేమొ నీ గానోత్సవముల ననుచు

ఇదియె నాచితి, పేర్చితి నేనె దీని

వదలిపోని యావసాన వాంఛ గాగ

వడకని కరాలు రగులుచు దుడుకు చిచ్చు

లాలనల నింత నుసిగాగ కాలు త్రుటినె!

అలయు వాతెఱ యూర్పు గాలులు కదల్చి

రేపునంతె నాకష్టాల రేగుమంట

మును బ్రతుకునట్ల నాదేహమును దహింపు!

పడదులే అర్పగా నొక బాష్పమేని!

పడమటికవుల షెల్లీ, బైరను మొదలగువా రిట్టి యీభావనకు దారి చూపినవారనుట సత్యమగుగాక! మన కృష్ణశాస్త్రిగారి కెందఱకో యందని తేనెబిందువులు దొరకినవి. అవి యాయన కవితలో నక్షరములై వెలికుబుకును. ఆయన పద్యము కాదు పాటకాదు మలచి మలచి, తూకము సరిపెట్టుకొని బయట బెట్టునలవాటు గలవ్యక్తి. భావన లోతునకు, పదముల కూరుపునకు హెచ్చు కుందు లుండవు. ఆ సుగుణముగల కవులు తక్కువ సంఖ్యలో నున్నారు. రచనలోని యీశిల్పము తీరు చూడుడు.