పుట:AndhraRachaitaluVol1.djvu/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వజ్ఝుల చినసీతారామస్వామి శాస్త్రి

1878


ఆరామద్రావిడ శాఖీయుడు. తల్లి: వేంకటాంబిక. తండ్రి: ముఖలింగేశ్వరుడు. నివాసము: విశాఖపట్టనము. జననము: 1878 జూను 25వ తేదీ, బహుధాన్య సంవత్సర జేష్ఠ బహుళ చతుర్థి. గ్రంథములు: 1. చింతామణీ విషయ పరిశోధనము. 2. వైయాకరణ పారిజాతము 3. కర్ణచరిత్రము 4. మార్గోపదేశిక 5. స్త్రీవివాహవయోనియమనము. 6. వీరసింహుడు (కావ్యము) 7. బాలసరస్వతీయ, అధర్వణకారికావళి, హరిశ్చంద్ర నలోపాఖ్యానాది గ్రంథములకు భూమికలు.


సీతారామశాస్త్రిగారిలో మహావిమర్శకునకుండవలసిన లక్షణములు సంపూర్ణముగ నున్నవి. కావున వీరు లక్షణవాజ్మయమున కఖండమగు సేవ గావింపగలుగుచున్నారు. తమ సిద్ధాంతములపై రాద్ధాంతములు పత్రికలలో వెలువడుచుండును. వానికి సాధారణముగా బ్రతివిమర్శనములు ప్రకటించుటకు వీరిచ్చగింపరు. తానొకధోరణిలో వ్రాసికొని పోవుచు, వచ్చిన ' టపా ' కూడ బరికింపడని వీరినిగూర్చి చెప్పుకొందురు. అంత యేకతానత ! వీరిమేధ నిరంతరము నాలోచనానిమగ్నము. ఐరోపామహాసంగ్రామము వారి కలజడి కలిగింపదు. ప్రత్యేక రాష్ట్రాందోళనము వారి చెవుల కెక్కదు. వారి పరిశోధనమే వారిది. తెలుగు వ్యాకరణముల యాస్తికతకు వీరు పెట్టినది భిక్ష. పాణినీయము, ముగ్ధబోధము మున్నగు సంస్కృతవ్యాకరణములు పరిశ్రమించి పఠించినవారగుటచే బాలవ్యాకరణ-చింతామణ్యాదులు బాగుగా విమర్శించి నిగ్గు వెల్లడింప గలుగుచున్నారు. వీరు రచించిన " చింతామణీ విషయ పరిశోధనము " వలన వీరి విశ్వతోముఖాంధ్ర వ్యాకరణ సమీక్షాపాటవము సుస్పష్టమగుచున్నది. చింతామణికి బూర్వము తెలుగు వ్యాకరణములు లేవని వీరాధారములు చూపిరి. " వైయాకరణ పారిజాతము "