పుట:AndhraRachaitaluVol1.djvu/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాసంస్థాన గురువు చెప్పిపొమ్మనెను. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు నిస్పృహులైపోదలచి పోవుచు, నూతనాస్థానకవి శ్రీ ద్వివేదిరామశాస్త్రిగా రొకచోట గూర్చుండ నచ్చటకుజేరి, వారితో నేదో లోకవృత్తాంతము సంస్కృతభాషలో బ్రసంగించిరట. ఆ రామశాస్త్రిగారు మన కవివరుని నిరర్గళధోరణికి బాండితికి నాశ్చర్యపడి ప్రభువు దర్శనము చేయించిరనియు, నాప్రభువు ఎదుట గోడమీదనున్న "శకుంతలా" ప్రతిమను వర్ణింపుడన నాయన మనసు గరగునటులు సంస్కృతములో శ్లోకములు రచించి చూపిరనియు, నప్పుడు శ్రీవారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి వార్షిక మేర్పాటు చేసెరనియు శ్రీ రామశాస్త్రిగారు "అభినవభోజచరిత్ర" లో వ్రాసిరి. ఈగాథ శాస్త్రిగారి నిర్గర్వితకు దారకాణగదా, యని పేరుకొనవలసి వచ్చినది.


వీరు తెనాలి సంస్కృతకళాశాలలో గొన్నాళ్లును, బందరు :హిందూ హైస్కూలు" లో గొన్నాళ్లును, బాపట్ల శంకరవిద్యాలయములో గొన్నాళ్లును ఆచార్యులుగా నుద్యోగించిరి. తరువాత 1927 లో కొవ్వూరు "ఆంధ్రగీర్వాణ విద్యాలయము" వారి యాహ్వానముపై వెళ్లి యచట సంస్కృతాంధ్రోపాధ్యాలుగా నెనిమిది తొమ్మిది యేండ్లుండి 1935 లో జీవయాత్ర చాలించిరి. కొవ్వూరి కళాశాలలో నుండగా శాస్త్రిగారికి, కాకినాడ విద్యార్థులు మా 'కళాశాల' కు దయచేయుడని యుత్తరములు వ్రాయ, "నేను గౌతమీస్నానమునకు గొవ్వూరిలో జేరితిని గాని, ఉద్యోగము చేయుటయే ప్రధానోద్దేశము కా" దని సమాధానము పంపిరని తెలిసినది.


సుబ్రహ్మణ్యశాస్త్రిగారు నైష్ఠికులు. పండితులు. కవులు. రసహృదయులు. శాంతచిత్తులు. వారిపేరు తెలుగువారు మఱచిపోరు. వారి కృతులు మనభాషకు భూషలు. ఇట్టివాడు కనుకనే సుబ్రహ్మణ్య