పుట:AndhraRachaitaluVol1.djvu/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబిని-ఇల్లాలు

"ఏలా నీకు భయంబుజెంద ? దలపై నెక్కించుకొందు న్నినున్

బాలా! యత్తయు నాడుబిడ్డలును నీపంతంబు చెల్లింత్రు నా

శ్రీలన్నింటికి నీవెరాణి" వని పేర్మింబల్కి పెండ్లాడి య

య్యాలిం గూలిపడంతికై వడిగనం బ్రాణంబు లెట్లొప్పెడిన్.

ఇది యటుండ, చెన్నపురమున నొక విద్వత్సమాజ మేర్పడి కృష్ణదేవరాయల కొండవీటి దండయాత్రను గూర్చి యొకకావ్యము రసోత్తర ముగా రచించువారిలో నుత్తమ శ్రేణికి జెందిన కవికి బంగారుపతకము బహూకరింతు మని ప్రకటించిరి. ఆ పందెములో మన కవుల రచనమే నెగ్గినది. అపు డిటులు చెప్పుకొన్నారు.

మద్రనగరాంధ్ర విద్వత్సమాజ దత్త

నూత్నవిషయ క్రియాలబ్ధ రత్నఖచిత

హేమబిరుదాభిరాములు, రామకృష్ణ

రచయితలు పీఠపుర యువరాజ గురులు.

ఇట్లీ మేనత్త-మేనమామబిడ్డలు క్రొత్తపోకడలతో గవితాభారతి నారాధించుచుండ 1918 లో ద్వితీయుడగు రామకృష్ణకవి యకాలమృతికి బాలుపడియెను. ఇత డాచార్య శంకరులవలె నత్యంత తరుణ వయస్సుననే మరణించి యేకైక పుత్రకులు సజీవులునైన తలిదండ్రుల దు:ఖాబ్ధి ముంచినాడు. చనిపోవునప్పటికీ కవికి 29 ఏడుల యీడు. ఈ సందర్భమున నీతరుణకవి విశిష్టత బేర్కొనుట యప్రస్తుత ప్రశంస కాదు. ఇతడు తన పదునొకండవ యేట 'నరకాసురవ్యాయోగము' నాంధ్రీకరించినాడు. పదునాల్గవయేట 'దమయంతీకల్యాణము' అను నచ్చ తెనుగు ప్రబంధము సంతరించినాడు. అసాధారణమైన మేధాసంపద గలవాడు. మూడు భాషలలోని మూడు పద్యములు కలిపివైచి 'వ్యస్తాక్షరి' యీయగా హేలగ జెప్పిన బుద్ధిశాలి. కాకరపఱ్ఱున జిన్ననాట నితడు