పుట:AndhraRachaitaluVol1.djvu/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన శర్మగారిని వ్యక్తిపరముగా దూషింప మొదలిడిరట. ఆ సభలో శర్మగారును గలరు. కాని వారు నవ్వుకొనుచు నూరకుండిరట. అయినను సభావేదికకు బ్రక్కవారి ప్రోత్సాహముచే నెక్కక తప్పినది కాదు. లేచి చెప్పినమాట లివి: "మహాజనులారా! ఈసమయమున వాదప్రతివాదములు జరుపుట నా కిష్టములేదు. ఏనాడో ఎన్నితరముల క్రితమో జనులయెడ మంచిగా మెలంగుచుండుటచే మాకు "జనమంచి" యను నింటిపేరు వచ్చినది. ఇప్పుడు నేనును మొగము చెండుకొని వారివలె ననవసరముగా నా ప్రతిపక్షుల విమర్శించితి నేని మాయింటిపేరు నేతిబీఱకాయను జేసినవాడ నగుదును." ఈ వాక్యములలో శర్మగారి సహృదయత వ్యక్త మగుచున్నదిగదా? మహాకవులకు మంచితనము తోడైనచో వచింపనేల ? శేషాద్రిశర్మగారు దత్తమండలమునకే గాక తెలుగు బుడమికి వన్నె దెచ్చు కవులు. నాస్తికతా ప్రాబల్యముతో నిండియున్న నేటికాలమునకు శర్మగారివంటి భాగవత కవులు, వారి గ్రంథములవంటి భక్తి రసపూరిత గ్రంథములు మిన్నగా జనింపవలసి యున్నది. శర్మగారి గ్రంథము లెల్ల వెలువరింప దీక్షించిన శ్రీ వావిళ్ళ వంకటేశ్వరశాస్త్రిగారి నభినందింపవలయును.

కళాప్రపూర్ణులు, కావ్యస్మృతి తీర్థులు నగు శేషాద్రిశర్మగారిని గూర్చి కట్టమంచి రామలింగారెడ్డిగారి ప్రశంస యుదహరింపదగినది. "వీరి కవిత్వమునకు వీరి వినయాతిశయము శోభను గలిగించుచున్నది. కవిత్వపాండిత్యములకును, సౌజన్యమునకును నిత్యసంధి లేదనుట మనమెఱిగిన విషయమే. వీ రెవ్వరినిగాని యధిక్షేపించినట్లు, ఎవ్వరితోగాని వాదమునకు బూనుకొన్నట్లు గానరాదు. సౌజన్యము వీరి కలంకారము. ప్రఖ్యాతికై ప్రాకులాడువారు కారు......"

శర్మగారి కవిత్వము ధారాళధోరణి గలది. వీరి గ్రంథము లన్నియు ననువాదములే యగుటచే గల్పనాగంభీరిమ వీరెంతగా బ్రదర్శింతు