పుట:AndhraRachaitaluVol1.djvu/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాఖ్యానసాహాయ్యమున భాష్యప్రాయముగ బెంచి రచించుట యొకటి. సంస్కృతమునను, దెనుగునను దొల్లి ప్రచురితములగు ప్రతులన్నియు బట్టిచూచి, పాఠభేదములు, ప్రక్షిప్తప్రదేశములు లెస్సగ బరికించి పూర్వాపర సందర్భములు తాఱుమాఱు గాకుండ జేయుట రెండవది. కవితాధార సంగతి వేఱే చెప్పనేల ? ఈతీరున జాలువాఱుచుండును.

సీ.రాలియున్న యవి కీరముల తొఱ్ఱలనుండి

చెదరి నీవారముల్ చెట్లక్రింద

తెలుపు చున్నయ వింగుదీ ఫలోద్భేదంబు

జిడ్డులై యందంద దొడ్డశిలలు

మెలగు చున్న యవి నమ్మికతోడ నెప్పటి

పగిది శబ్దముసైచి మృగములెల్ల

కలిగియున్నయవివల్కల శిఖానిష్యంద

రేఖాంకముల నీళ్ళ రేవుదార్లు

మాఱియున్నవి యాజ్యధూమంబువలన

జివురుటాకుల కాంతులు చెన్నుదరిగి

తోగియున్నవి గాడ్పుల దొలకి పాఱు

బోదియలనీళ్ళ బాదపంబుల మొదళ్ళు 'ప్రథమాంకము'

ఉ. ఘ్రాతముగాని పుష్పము, సఖంబుల ద్రుంపని పల్లవం బను

న్యూతముగాని రత్నము రుచుల్గయికోని నవాసవం బఖం

డాతత పుణ్యసత్ఫలము నట్లనఘమ్మగు నాలతాంగి రూ

పాతిశయంబు నెవ్వనికి నంచు విరించి సృజించి యుంచెనో?

కవిరాజుగారి మేఘసందేశపు దెలుగు సేతలోని మచ్చు పద్యములు మఱి రెండు: