పుట:AndhraKavulaCharitamuVol2.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రయోస్తు నిత్యం స్యాన్" అన్నది బాలసరస్వతి సూత్రమనుకోక వాగను శాసనసూత్రమని భ్రమపడి


గీ. చెల్లునని మున్నుభీమన చెప్పెననుచు
   గలుపుదురు రేఫములును ఱకారములును
   దుష్టకవు లవి యొకటైన దొంటిపెద్ద
   లందఱును నేల విభజింతు రని తెలియరు.


అని రేఫఱకారములకు యతిప్రాసమైత్రికూర్చువారు దుష్టకవులని యప్పకవి దూషించి యున్నాడు. రకారద్వయమైత్రిని నిషేధించిన బాలసరస్వతియే తద్భేదము గ్రహింపలేక చంద్రికాపరిణయములోని యీ క్రింది పద్యమునందు రేఫఱకారములకు విశ్రమము కూర్చినాడని కూచిమంచి తిమ్మకవి వ్రాసియున్నాడు-


ఉ. అక్కమలేక్షణ న్సవినయంబుగ గాంచుము నాదుమాఱుగా
   మ్రొక్కుము సేమమా భువనమోహిని నీకనిపల్కు మార్తిచే
   జిక్కితి వేగ బ్రోవుమని చెప్పుము పొమ్మిక దేటిరాయ నీ
   ఱెక్కలమాటున న్నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్- [చంద్రికాపరిణయము]

రేఫరకారమైత్రికి సమ్మతింపనివారవి రెండును నేకాక్షరమే యందురా?భిన్నాక్షరము లందురా? ఏకాక్షరమేయయి లఘ్వులఘు రూపములుమాత్రమే యయినయెడల, యలవల లఘ్వులఘు రూపములకువలెనే వీనికి గూడ మైత్రి యేల యుండరాదు? భిన్నాక్షరము లనెడు పక్షమున, రయోస్తు నిత్యం స్యాత్తనుచోటనేక శేషవృత్తి యెట్లు కుదురును ? అవి యొకటైన దొంటిపెద్దలేల విభజింతురని యప్పకవి యడిగిన ప్రశ్నమునకు యలవల నేల విభజించిరో యా హేతువుచేతనేయని చెప్పుటయే తగిన యుత్తరమగును.