పుట:AndhraGuhalayalu.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశమున శిలాపర్వతములను తొలిచి గుహాలయాలను ఏర్పరచుట మౌర్యుల కాలము తుదినుండి ఆరంభమయ్యెను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరునకు 25 మైళ్ళ దూరమున నుండు 'గుంటుపల్లి' లోని కొండలను తొలిచి నిర్మించిన చైత్యగృహములను, విహారములను పరిశీలించినచో ఇవి మౌర్యకాలము తరువాతివని తెలియుచున్నది.

మౌర్యవంశానంతరము ధాన్యకటక, ప్రతిష్టానపురములు ముఖ్యపట్టణములుగా కలిగి సముద్రతీర ఆంధ్ర దేశమును పరిపాలించిన ఆంధ్ర శాతవాహనులు వైదికమతాన్ని అనుసరించినను ఆనాటి బౌద్ధులకు విహారములు, చైత్యగృహాలు నిర్మించి దానము చేసిరి.

విజయవాడకు తూర్పున గల మొగల్ రాజపురము, కృష్ణకు దక్షిణతీరమున గల ఉండవల్లి గుహలనుబట్టి ఈ గుహల నిర్మాణము ప్రోత్సహించినవారు శాతవాహనులని యనవచ్చును. తరువాత వచ్చిన ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు,శాలంకాయనులు వీటిని ప్రోత్సహించిరి. ఇక్ష్వాకుల తుదిదశయందు పల్లవులు తాత్కాలికముగా నెల్లూరు ఉత్తరమునకు వ్యాపించి కొంతకాలము ధాన్యకటకము పాలించిరి.

పల్లవరాజగు మహేంద్రవర్మ ధాన్యకటకమందు రాజప్రతినిధిగా యుండగా ఇట్టి గుహాలయ నిర్మాణములను గూర్చి తెలుసుకొని కలప, ఇటుక, లోహనిర్మితములకంటె శాశ్వతమైన వీటి నిర్మాణాలను ఆంధ్రదేశమందు ప్రోత్సహించెను. కొంతకాలమునకు పల్లవులు జయింపబడి దక్షిణదేశమునకు పారద్రోలబడినందున పెన్నవరకు వెనుకకు వచ్చి, పెన్న పరిసర దక్షిణ ప్రాంతములను ఆక్రమించిరి అట్టి ఆక్రమణ కాలమున నిర్మించిన పర్వత గుహాలయాలకు భైరవకొండలోని శిల్పములే తార్కాణమని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యంగారి అభిప్రాయం. కాసి. ఇచ్చటి గుహాలయాలు క్రీ.శ 8వ శతాబ్దమునకు చెందినవిగా కొందరు శాస్త్రవేత్తలు భావించుటవలన మహేంద్రవర్మ క్రీ.శ. 7 వ శతాబ్దము వాడు గనుక, ఇవి మహేంద్రవర్మచే నిర్మింపబడినవనెడి డా॥సుబ్రమణ్యంగారి అభిప్రాయం భేదాభిప్రాయానికి తావిచ్చుచున్నది.

భైరవకోన నెల్లూరు జిల్లా, ఉదయగిరి తాలూకాయందు కొత్తపల్లివద్ద కలదు(మాప్ నం. 1,2 చూడుము). నెల్లూరునుండి, కావలినుండి యిచ్చటకు మార్గములు కలవు. ఇది కావలికి సుమారు 70 మైళ్ళ పశ్చిమాన 'కొత్తపల్లి కొండలలో కలదు. ఇచటి దేవాలయమందు భైరవమూర్తి కన్పించుచుండుటచే ఈ ప్రాంతమునకు భైరవకోన లేక భైరవకొండ యను పేరు వాడుకలోనికి వచ్చినది. ఈ భైరవమూర్తి శిల్పము ఇచటి సెలయేటి తూర్పు ఒడ్డు భాగమున ఒక పెద్ద బండ విభాగమున చెక్కబడియున్నది. ఈ శిల్పము చుట్టూ తరువాతి కాలములో దేవగృహ నిర్మాణము చేయబడినది. దీని చెంతనే కొన్ని చిన్న చిన్న దేవగృహములు (memorial shrines) గలవు వీటిలో దక్షిణ కొనలోని దేవగృహ ద్వారమున కిరువైపులా రెండు బ్రహ్మ, నాల్గు చేతుల విష్ణువుల ఆర్ధశిల్పములు గలవు ద్వారము పై విభాగమున 'రాజపొరేరి' రాజు కుమార్తెయైన 'గోయింద పొరేరి' మనుమరాలైన 'లోకమ' చే ఈ చిన్న గుహాలయము రూపొందింపబడినదని తెలుపబడియున్నది. ఈ శాసనము క్రీ.శ. 9 వ శతాబ్దమునాటి తెలుగు చోడరాజులకు చెందినదిగా తెలియుచున్నది.

భైరవకోనవద్ద గల ఒక కొండపై ఉన్న 'లింగాలదొరువు'నందు ఉద్భవించు గంగ భైరవకోనవద్ద జలపాతముగా మారి దుర్గా భైరవాలయమునకు. గుహాలయములకు మధ్య 'సోనవాన' యను పేరుతో ప్రవహించెడి సెలయేటికి కొంతదూరములో soft schist శిలయందు నిర్మింపబడిన వల్లన వాస్తు శిల్పశైలి యనబడెడి ఎనిమిది గుహాలయములు గలవు (11 నుండి 22 వరకు గల చిత్రపటాలు చూడుము). మహాబలిపురమున గల గుహల