పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈమూఁడుభావనలచే, నేమఱక ముకుందుఁ దలఁచి యెప్పుడు యోగ
శ్రీమహితబుద్ధినుండుట, భూమీశ్వర ధారణాఖ్యముగఁ జెప్పఁబడున్.

451


తే.

ఈచరాచరమైనట్టి యీ ప్రపంచ, మీశ్వరునిస్థూలరూపంబ యెఱిఁగికొనుము
మానవేంద్ర సత్తామాత్ర మైనమూర్తి, నమరు సూక్ష్మరూప మైనపరాపరములు.

452


తే.

స్థూలసూక్ష్మరూపంబులతోడి వాసు, దేవు నెవ్వాఁడు భావనాత్రితయకలిత
బుద్ధిఁ దలపోయు నతఁడె పో భూవరేణ్య, ధ్యాని యాత్రజ్ఞులకు నీమతంబు మేలు.

453


తే.

విష్ణుశక్తి చరాచరవితతియందుఁ, దారతమ్యప్రవృత్తులఁ దనరియుండు
నట్టి జగదాత్మకుం డైనయాదిదేవు, భేదవాదులు చూతురు భేదముగను.

454


వ.

ఇవ్విధంబునఁ జెప్పంబడిన యోగ విద్యాభ్యాసంబువలన జితశ్రము లయినమహా
త్ములయాత్మయందుఁ బ్రకాశితుండయి పరమాత్ముం డయిన లక్ష్మీకాంతుండు
మనోజనితంబు లయినకిల్బిషంబుల నణంచి పరమసాధనంబు లైనశుభంబులఁ
గావించునని యిట్లు సంక్షేపరూపంబుగా నధ్యాత్మవిషయం బుపదేశించినఁ
గృతార్థుండై ఖాండిక్యుం డిట్లనియె.

455


క.

నృపచంద్ర నీవు నా కిపు, డుపదేశము చేసినట్టి యోగమువలనన్
విపులజ్ఞానము వొడమెను, ప్రసన్న మయ్యె మనసు పద్మాక్షునిపై.

456


వ.

అని బహుప్రకారంబులం బూజించినం బ్రీతుండై కేశిధ్వజుండు నిజపురంబున
కరిగె ఖాండిక్యుండును దనరాజ్యంబునకుఁ గుమారునిం బట్టంబు గట్టి యోగ
విద్యాభ్యాసంబువలన సకలసుఖంబులం బడసి సుఖంబుండె నంత.

457


క.

ఘనసుతుఁ డగు కేశిధ్వజ, జనకుఁడు తనమిథిల కరిగి సత్కర్మములన్
వనజాయతాక్షు నారా, ధన సేయుచుఁ బెక్కుసప్తఠతంతులు సేసెన్.[1]

458


ఆ.

ఇవ్విధమున నతఁ డనేకయజ్ఞంబులు, చేసి వాసుదేవుచేత సకల
వైభవములుఁ బడసి ప్రాభవం బేపార, లీలతో ధరిత్రి యేలుచుండె.

459


వ.

ఇవ్విధంబున జనకచక్రవర్తి సకలశోభనకరుం డయినలక్ష్మీవల్లభుకృపాకటాక్షంబు
వలన ననేకపుత్రపౌత్రాభివృద్ధియును సముద్రవేలావలయితవసుంధరాచక్ర
సామ్రాజ్యలక్ష్మీనివాసంబును అణిమాదిమహైశ్వర్యధుర్యప్రాభవంబును గలిగి
సకలలోకంబులు జయపెట్ట మిథిలాపురంబున రాజ్యంబు సేయుచుండె నని పలికి
పరాశరుండు వెండియు నిట్లనియె.[2]

460
  1. సప్తతంతులు = యజ్ఞములు.
  2. జనకచక్రవర్తి = జనకచక్రవర్తివంశజాతుఁ డగుకేశిధ్వజుఁడు.