|
దేవతావాచకంబుగా దీయర్థంబు తొల్లి జనకసంభవుం డైన కేశిధ్వజుం డను
రాజర్షి ఖాండిక్యజనకున కుపదేశించెనని మైత్రేయుం డిట్లనియె.
| 390
|
కేశిధ్వజఖాండిక్యజనకసంవాదము
క. |
మునివల్లభ కేశిధ్వజుఁ, డనఁగా ఖాండిక్యజనకుఁ డనఁగా నెవ్వా
రనఘాత్మ వారలకు యో, గనిమిత్తము వాద మేల గలిగెను మొదలన్.
| 391
|
క. |
అనవుడుఁ బరాశరుం డి, ట్లను జనకునికి కులజుఁ డైనయమితధ్వజుఁ డ
త్యనఘుని ఖాండిక్యుని లో, కనుతుఁ గృతధ్వజునిఁ గాంచె గాదిలిసుతులన్.
| 392
|
వ. |
వారిరువురుం దండ్రిపరోక్షంబునఁ బైతృకంబైన రాజ్యంబు సమభాగంబుగా
ననుభవించుచుండ నాకృతధ్వజనందనుం డైన కేశిధ్వజుండు మహాతపోధనుం
డును ఆత్మవిద్యాపరాయణుండును, బలపరాక్రమధుర్యుండును నై యవిద్య
వలన సంసారంబుఁ దరియింతునని నిశ్చయించి తండ్రి పిమ్మట నాత్మీయరాజ్య
భోగంబు ననుభవించుచుండె.[1]
| 393
|
తే. |
కర్మమార్గమునను ఖాండిక్యజనకుండు, వసుధ యేలుచుండె వారిలోనఁ
గడువిరోధమైన ఖాండిక్యు గెలిచి కే, శిధ్వజుండు వానిసిరులు గొనియె.
| 394
|
క. |
ఖాండిక్యుఁడు సకలమహీ, మండలమును గోలుపోయి మంత్రులుఁ దానున్
జండతరదుర్గములలో, నుండెను కేశిధ్వజుండు యుర్వర యేలన్.
| 395
|
మ. |
ఆకేశిధ్వజుఁ డొక్కనా డొకమహాయజ్ఞంబు గావింపఁగా
నాకాలంబున ఘర్మధేనువు మహోగ్రారణ్యదేశంబులోఁ
జీకాకై పులిచేతఁ బట్టువడి చచ్చెన్ జచ్చినన్ దీనతన్
భూకాంతుండు మఘంబు మాని మిగులదుఃఖాకులస్వాంతుఁడై.[2]
| 396
|
వ. |
తదీయదోషంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబు ఋత్విజుల నడిగిన వా రెఱుంగక
కశేరుం జెప్పిన నారాజమునీంద్రు నడిగె నతండు భార్గవు నడుగుమనియె భార్గ
వుండు శునకునిం జెప్పిన నారాజు శునకు నడిగిన నతం డిట్లనియె.
| 397
|
మ. |
అవనీనాయక గోవధంబునకుఁ బ్రాయశ్చిత్తసత్కర్మముల్
వివరింపంగ భవద్విరోధి యగుఖాండిక్యుండు దా నేర్చు వా
నివివేకంబునఁ బోల వెట్టి మతులున్ నీవేగి యారాజయో
గివరున్ వేఁడుము వానిచిత్త మకలంకీభూత మెప్పట్టునన్.[3]
| 398
|
క. |
అని చెప్పి శునకుఁ డెందేఁ, జనియెను గేశిధ్వజుండు సందేహము లె
ల్లను విడిచి పూర్వవైరము, మనమునఁ జొరనీక కడుసమంజసవృత్తిన్.[4]
| 399
|
- ↑ అవిద్యవలన = కర్మానుష్ఠానమువలన, తరియింతును = దాఁటుదును.
- ↑ ఘర్మధేనువు = ప్రవర్గ్యమునందలి హవిర్విశేషముకొఱకు పాలుపిదుకునట్టియావు (ఘర్మము = ప్రవర్గ్యమునందలి హవిర్విశేషము, ప్రర్గ్యము = అగ్నిష్టోమాద్యంగభూతమైన యాగవిశేషము.)
- ↑ అకలంకీభూతము = కలంకము లేనిది.
- ↑ సమంజస = యోగ్యమైన.