వ. |
ఇవ్విధంబున మహాఘోరయుద్ధంబు సేయునప్పుడు.
| 189
|
ఆ. |
హరి సుదర్శనమున నసురేశ్వరుని వేయి, చేతులందు రెండుచిక్క నఱకెఁ
బార్వతీశుఁ డపుడు పఱతెంచి బాణునిఁ, గావు మనుచు వాసుదేవుఁ బలికె.
| 190
|
వ. |
కృష్ణుండు మహేశ్వరప్రార్థితుండై బాణాసురుం గాచిపుచ్చి కారాగృహంబున
నున్న యుషాకన్యకానిరుద్ధులం దోడ్కొని ద్వారకానగరంబునకు వచ్చి సుఖం
బుండె నంత.
| 191
|
క. |
వారాణసిపుర మేలెడు, ధీరాత్ముఁడు పౌండ్రవాసుదేవుఁ డనంగాఁ
బేరుగలరాజు తనతో, నే రాజులుఁ బోలరని మునీశ్వర యుండున్.
| 192
|
శ్రీకృష్ణుండు పౌండ్రకవాసుదేవుని సంహరించుట
తే. |
వాసుదేవాభిధానగర్వమునఁ జేసి, పాంచజన్యసుదర్శనప్రముఖనిఖిల
చిహ్నములుఁ బూని రాజ్యంబు సేయుచుండె, నన్యభూపాలకులు దన్ను నవహసింప.
| 193
|
వ. |
ఇవ్విధంబున నద్దురాత్ముండు దురహంకారంబునఁ దనకొలంది తా నెఱుంగక
కృష్ణుని మహానుభావత్వంబునకు నసహ్యపడి యతని పరిభవించుతలంపున నొక్క
దూతతోడ సమస్తంబు నిర్దేశించి కృష్ణునిపాలికిం బనిచిన వాడును సకల
బంధుమిత్రసమేతుండయి పేరోలగంబుననున్న కృష్ణునిం గాంచి యిట్లనియె.[1]
| 194
|
క. |
విను పౌండ్రవాసుదేవుఁడు, నను నీకడ కనిచె నందనందన నీతోఁ
బనివడి నీవా రెల్లను, వినఁగా ననుమన్నమాట వినుమా తెలియన్.[2]
| 195
|
మ. |
జగదేకప్రభుఁడ సముజ్జ్వలరమాసంపన్నుఁడ శంఖచ
క్రగదాశార్ఙ్గధరుండఁ గౌస్తుభమణిగ్రైవేయుఁడ నే మహో
రగవైరిధ్వజచారుపీతవసనప్రాప్తుండ శ్రీవత్సచి
హ్నగరిష్ఠుండను వాసుదేవుఁడ నృపుల్ నాతోడ నీడౌదురే.[3]
| 196
|
చ. |
బెదరక వాసుదేవుఁ డనుపేరును జక్రముఁ బాంచజన్యమున్
గదయును శార్ఙ్గచాపమును గైకొనియుండిన నోర్వవచ్చునే
యదుకులజుండ నీకు నివి యర్హమె యిన్నియు నుజ్జగించి స
మ్మదమున నన్నుఁ గొల్వు మనుమానము మానుము నందనందనా.[4]
| 197
|
- ↑ కొలంది= అంతరము, అసహ్యపడి = రోసి, నిర్దేశించి = చెప్పి, పేరోలగంబునన్ = పెద్దకొలువునందు.
- ↑ పనివడి = ప్రయత్నపూర్వకముగా.
- ↑ మహోరగవైరిధ్వజ = గొప్పదైన గరుడధ్వజమును, చారుపీతవసనప్రాప్తుండన్ = మనోజ్ఞమైన పచ్చనివస్త్రమును పొందినవాఁడను, గరిష్ఠుండన్ = మిక్కిలి గౌరవము గలవాఁడను.
- ↑ ఉజ్జగించి = విడిచి.