పుట:Anandam Manishainavadu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బల్లిపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించినది మొదలు లింగారాయుడుగూడెం పాఠశాలలో ఉద్యోగ విరమణ వరకు విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా అనేక కార్యక్రమాలను రూపొందించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకోసం దాతల సహకారమర్ధించి, వారికవసరమైన ఫీజులు పుస్తకాలు, టి.వి.లు, కంప్యూటర్లు దుస్తులు సమకూర్చారు. విద్యార్థుల శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి అవసరమైన ఆటవస్తువులు, వినోద సాధనాలు, వ్యాయామ పరికరాలు, స్కూలులో పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా మొక్కలు పెంపకం, సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికలను సమకూర్చారు.

ప్రయోగాత్మకంగా గొల్లగూడెం పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్ధులకు సౌకర్యవంతంగా కుర్చీలందించారు. ప్రభుత్వానికి విధానాలు నచ్చడంతో సర్వశిక్ష అభియాన్ నిధులతో, పాఠశాలకు కుర్చీలను ఏర్పాటుచేసేలా ఉత్తర్వులిచ్చారు.

అనేక కారణాలతో పాఠశాల విద్యకు దూరమైన విద్యార్ధుల తల్లిదండ్రులను ఒప్పించి, విద్యార్ధులను స్కూళ్ళకు రప్పించారు. పాఠశాల విద్యార్ధులతో వార్షికోత్సవాలు, వనభోజనాలు నిర్వహించి, సమష్ఠితత్వాన్ని ఐక్యతను, సమానత్వాన్ని బోధించుటయేగాక ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడయ్యారు.

ఉమ్మడి కుటుంబం నేపధ్యంలో పుట్టి పెరిగిన రమణ మాస్టారు అందరికీ ఆదర్శప్రాయంగా కుటుంబ ధర్మాన్ని నెరవేర్చారు. అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెళ్ళుపట్ల గౌరవంతో, ప్రేమతో, బాధ్యతతో వ్యవహరించారు. మాతృమూర్తికి ఆమె తుదిశ్వాసదాకా రమణ సాయిలక్ష్మి దంపతులు సేవలందించారు. అన్నదమ్ములపట్ల అవ్యాజమైన ప్రేమతో రెండో అన్న రామచంద్రుడుగారి మరణానంతరం, వదినగారు పోషనకు తగిన ఏర్పాట్లు చేశారు. సమాజానికి స్పూర్తిని కలిగించేలా మాతృమూర్తి సావిత్రమ్మ జన్మదిన వేడుకలు కుటుంబసభ్యుల, బంధుమిత్రుల, ఆత్మీయుల సమక్షంలో ఎంతో వేడుకగా జరిపేవారు. అక్కగారిపట్ల గౌరవభావంతో, ప్రేమతో, అక్క కుమార్తె

3