పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

విజయపురి నాగార్జునాచార్యుల కాలంలోనే పెద్దనగరమైనది. ఎటు చూచినా రెండు గోరుతాలుంటుం దానగరం. కృష్ణానదీతీరాన యోజనదూరం వ్యాపించినది. ఈ మహాపట్టణానికి ఉపగ్రామాలు ఇరువది ముప్పది ఉన్నాయి. ఈ మహానగరానికి ధనకుల శేఖరుడైన బ్రహ్మదత్తుడే పాలకుడు. ఈ విశాఖాయనకులలో ఒక కుటుంబంవారు ఇప్పటికి రెండు మూడు వందల సంవత్సరాలనుంచి వేంగీరాష్ట్రానికి మహాసామంతులు, మహాతలవరులు, మహాసేనాపతులుగా ఉన్నారు. బ్రహ్మదత్తుని తాతతండ్రులు, ఇక్ష్వాకు శాంతి మూలమహారాజున్నూ మహాచార్యబోధిసత్వ నాగార్జునదేవుని శిష్యులు.

నాగార్జునదేవుని మిత్రుడైన వాసిష్టీపుత్ర పులమావి చక్రవర్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అఖండ సామ్రాజ్యము పాలించి దివంగతులయ్యారు. వారి మామగారు ఉజ్జయిని మహాక్షాత్రపుడు అల్లుని లోకువ చేసి ఆంధ్ర సామ్రాజ్యంనుంచి విడిపోయి, అల్లునితోడనే యుద్దం సాగించాడు. అప్పుడు నాగార్జునదేవుడు ఇరువాగులవారికి సంధిచేసి, మామగారిచే అల్లుని చక్రవర్తిత్వం ఒప్పించారు.

వాసిష్టీపుత్ర పులమావిపుత్రులు భారద్వాజీపుత్ర శివశ్రీ ఛత్రపాణి నాగార్జునదేవుని ప్రియశిష్యుడై, తండ్రి నిర్యాణానంతరం చక్రవర్తి సింహాసనం అధిష్టించి పదమూడు సంవత్సరాలు రాజ్యంచేసి పుత్రుడైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణిని నాగార్జునదేవునికి అప్ప చెప్పి, భగవంతునిలో లీనమైపోయినాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి సార్వభౌమ సింహాసనాసీనుడైనాడు. ఛత్రపాణి చక్రవర్తి మహాభక్తుడై రాజ్యపాలనంలో ఎక్కువ శ్రద్ధవహించక మేనమామలయిన క్షాత్రపులు స్వాతంత్ర్యం పొందినా, చూటు శాతకర్ణులు, మహాభోజ కాదంబులు, మహారథులు, అభీరులు, స్వాతంత్ర్యం పొందినా ఊరుకొనెను. ఉత్తరాంధ్రనాగులు, వాకాటులు, మాఠరులు, వాసిష్టులుగూడ స్వాతంత్ర్యం పొందినారు. ఇటు వేంగీపుర సాలంకాయనులు, గూడూరుపుర బృహత్పాలాయనులు, ఇంద్రకీల విష్ణుకుండినులు, ధనదుపుర ధనకులు, పూంగీప్రోలుపుర గౌతములు మాత్రం విజయపుర ఇక్ష్వాకులతోపాటు మహాసామంతులయి రాజ్యం రక్షిస్తూ ఉండిరి.

యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తి సింహాసనం ఎక్కగానే ఇక్ష్వాకు శాంతమూలుడు సర్వసేనాపతిగా, దేవదత్తుడు సేనాపతిగా సాలంకాయనాది సామంతులు కొలువ అఖండసైన్యం చేకూర్చుకొని, ఒక్కసారి దిగ్విజయానికి బయలుదేరినంత స్వాతంత్ర్యం పొందిన రాజ్యాలన్నీ దాసోహమని కప్పం గట్టినవి. ఆ దిగ్విజయం పూర్తికాగానే ధాన్యకటకం తిరిగివచ్చి, యజ్ఞశ్రీ అశ్వమేధం, వాజపేయం చేసినారు. నేడు యజ్ఞశ్రీ వృద్దుడైపోయినాడు. ఇంక దక్షిణా పథం అంతా ముక్కలు కావలసిందేనా అని అనుకుంటూ బ్రహ్మదత్తప్రభువు ఆ మహాచైత్య మందిరంలో దిగువ అంతస్తులందు భిక్షులకడకు వచ్చినాడు.

ఆ భిక్షులందరూ బ్రహ్మదత్తునిపై నాగార్జునదేవునికి ఉన్న ప్రేమ ఎరుంగుదురు. బ్రహ్మదత్తుడు, ఆనందార్హతులు, శాంతమూలుడు, చక్రవర్తి యజ్ఞశ్రీ మాత్రమే నియమిత దినాలలో, నియమితకాలాల ఆ బోధిసత్వుని దర్శింపవచ్చు.

అడివి బాపిరాజు రచనలు - 6

31

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)