పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన జుట్టు పూర్తిగా నెరిసిపోయింది. దేహాన అనవసరమైన కండలేమీలేవు. చర్మపు కాంతి తగ్గిపోక దివ్యమై మెరుస్తున్నది. ఆయన మోమున దరహాస కాంతులు అతిలోక తేజస్సుల లీనమై సర్వ విశ్వాసాలను అమృతపు గలయంపి చల్లుతున్నవి. ఆయన రూపమే దివ్యమందాకిని.

నాగార్జునదేవుడు కోసలరాష్ట్ర బ్రాహ్మణుడై, మహావిద్వాంసుడని ఎనిమిదేండ్ల వటువుగానే పేరుపొందడంచేత, ఆంధ్రశాతవాహన చక్రవర్తి ఆ బాలకుని మంజుశ్రీ దేవుడని యెంచి పూజించెనట, ఆ మహాభాగుడు సర్వ విద్యాక్షేత్రములు సేవించి తిరిగి ఆంధ్రదేశానికివచ్చి ధాన్యకటక మహా సంఘారామంలో తాను రచించిన మాధ్యమికవాద సూత్రాలను శిష్యులకు నేర్పజొచ్చినాడు. ఆ మహాభాగుడు వాదనిష్టురుడు.

ఆశ్రమ నియమాలు ఉల్లంఘించిన పదివేవురు భిక్షులను వైశాలి నగర మహా సంఘసభ వెడలగొట్టినది. వారిలో ఆరువేలమంది ధాన్యకటక సంఘారామ, ప్రతీపాలపుర, కంటకశిలా సంఘారామాది వివిధ సంఘారామాలకు చెందిన భిక్షులు. వీరే మహా సాంఘికులని పేరుపెట్టుకొన్నారు. వీరికి వ్యతిరేకము మహాస్థ విహారవాదము. ఆంధ్ర మహాసాంఘికులను అంధక సాంఘికులని భారతీయ బౌద్ధ సంఘాలు పిలిచేవి. నిరీశ్వర వాదమైన భౌద్దము నానాటికి శుష్కమై సాధారణ ప్రజలకు రుచించడంలేదు. ప్రజాసామాన్యమునకు తర్కముతో బనిలేదు. వారిభక్తికి ఆధారము లేకపోయినది. కావుననే వారు బుద్దధాతువులు నిక్షిప్తమైన చైత్యాలను, బుద్ధదేవ చిహ్నాలయిన పాద, బోధివృక్ష, ధర్మచక్ర, పూర్ణకలశ చైత్యములను పూజించి, చివరకు బుద్దునే దేవుడన్నారు.

అది అదనుగాగొని ఆర్షధర్మవాదులు, బౌద్దమతాన్ని ఖండించి, మరల ఆర్షధర్మము పునరుద్దరింప సాగినారు. ఈ రెంటినీ సమన్వయించు వాదము మాధ్యమికము. దీనినే మహాయాన మంటారు. ఈ పూర్ణ పురుషుడైన నాగార్జున దేవుడు బౌద్దధర్మాని అశోకుని తర్వాత రెండోసారి పునరుద్దరించినాడు. ఈయన జంబూద్వీపం అంతా తిరిగి ధర్మ దిగ్విజయముచేసి, మళ్ళీ ధాన్యకటక పురిలో తన ఆశ్రమానికి చేరుకొనేసరికి, వాసిష్టీపుత్ర పులమావి చక్రవర్తి సర్వ దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపతిగా ఏలుచుండెను. అప్పటికి నాగార్జునునకు నలుబది సంవత్సరాలు.

వాసిష్టీపుత్ర పులమావి అటు ఆర్షధర్మ మవలంబించి అశ్వమేధాది క్రతువులు చేస్తూఉండెను. ఆయన తనతండ్రి గౌతమీపుత్ర శాతకర్ణి వలన అమిత గౌరవం పొందిన ఆచార్య నాగార్జున పరమార్హతులను పూజించెను. సర్వ ధర్మాలు ఆయాచార్యదేవునిడు నేర్చుకొన్నాడు. నీతివిశేషాలను గూడ నాగార్జున దేవునివలన గ్రహిస్తూ ఉండెను. సర్వదక్షిణాపథంలో ఉన్న వందల కొలది మహాసంఘారామాలకు ఆచార్యదేవుడు ముఖ్యాచార్యుడయినాడు.

కొంతకాలనికి ఆ మహాతపస్వి అటవీ ప్రదేశానికి సమీపంగా తనకొక గ్రామాశ్రమం నిర్మింపుమని చక్రవర్తిని కోరినాడు. ఆ వాసిష్టీ పుత్రుడు అటవీ రాజ్యమైన కొరవి రాష్ట్రానికి చోరరాష్ట్రానికి ధనకరాష్ట్రానికి పల్లవ భోగానికి మహాసామంతులయిన ఇక్ష్వాకు ప్రభువులు నిర్మించిన విజయపురికడ శ్రీపర్వత శిఖరంపై నాగార్జునదేవునికొక పవిత్రాశ్రమం నిర్మించెను.

అడివి బాపిరాజు రచనలు - 6

30

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)