(24)
మాధవీలతాకుమారి నెత్తుకొనిపోవు ముష్కరులు తాము నిర్దేశించుకొన్న స్థలము కడకు పరుగిడి పోవుచుండిరి. వారా బాలిక కదలకుండ రజ్జువులచే గట్టివేసిరి. నోట గుడ్డను గ్రుక్కిరి.
సరిగ వారచ్చట చేరబోవునప్పటికి చాళుక్యాంగ రక్షక దళములు వారిని చుట్టముట్టినవి. వారు తమ ఆయుధముల బారవేసి, తలలు వాల్చి నిలిచిపోయిరి. మాధవీలతాకుమారికట్ల నొక్కవృద్దసేనాపతి విప్పి, నోటి గుడ్డలాగి వేసినాడు.
విష్ణువర్ధన ప్రభువు బలమెట్టిదియో కాని కుంభమిత్రుని మహాఖడ్గమును తూలికవలె త్రిప్పుచు, ఏటుకొక ముష్కరుని తీతకొక రాక్షసుని ఆ వీరాధివీరుడు హతమార్చు చుండెను.
కుంభమిత్రు డెడమచేత, కుడిభుజమున దిగిన విష్ణువర్ధనుని ఛురికను లాగివేసి రక్తము చిమ్మన ప్రవహింపుచు దన్ను తడిపివేయుచున్నను లెక్కజేయక రోజుకొనుచు, నెడమచేత గదను ధరించి, విష్ణువర్ధనుని కడకు బరునికి వచ్చెను.
విష్ణువర్ధనుని జుట్టిముట్టినవారు నలుగురైదుగురు హతమారినారు. ఆ ప్రభువునకు రెండుచోట్ల గాయములు తగిలినవి. -
కుంభమిత్రు డాప్రభువుని వెనుకనుండి పొడిపొడిచేయ గద నెత్తినాడు. ఆ గండరగండ డక్కడ లేనేలేడు. తన కున్న బలమంతయు నుపయోగించి ఒక్క యురుకున ఒక మామిడిచెట్టు మొగ కావీరు డురికినాడు. ఆ చెట్టునకు వీపాన్చి రోజుచు ఖడ్గమునెత్తి తనకడకు వచ్చు ప్రతివానిని తెగటార్ప సిద్ధముగ నుండెను. కుంభమిత్రుడు తన గదను గిరగిర నెడమచేతితోడనే త్రిప్పుచు, పాము మాపులు విష్ణువర్ధనునిపై బరపుచు, నొక్కొక్క అడుగున నా ప్రభువును దరియుచుండెను.
ఆ సమయమున సింహగర్జన నొనరించుచు జయనంది పరుగున వచ్చినాడు. “ఎవడురా నా రాజును ఎదుర్కొన్నది” అని జయనంది అరచి వజ్రపాతమువలె కుంభమిత్రుని దాకినాడు.
విష్ణువర్ధనుని అంగరక్షకులు రామబాణ వినిర్ముక్త మృత్యుశరములవలె వచ్చి ఆ ముష్కరులపై దలపడినారు.
కుంభమిత్రుని తల ఎగిరి భూమిపై పడినది.
జయనంది, నిశ్చలుడై చెట్టు మొదల నిల్చియున్న చాళుక్యుని కడ మోకరిల్లి కన్నుల నీరుతిరుగ "మహా ప్రభూ! తమ కెంతటి యాపత్తు తెచ్చినాను. నా ప్రమత్తతయే దీనికి గారణ” మనచు దన యుత్తమాంగ మా ప్రభువు పాదముల కాన్చినాడు.
విష్ణువర్ధనుడు చిరునవ్వున జయనంది నెత్తి, తన హృదయమున కదుమునొన్నాడు.
అతని హృదయమున యంశుమతి దివ్యదేవియై సాక్షాత్కరించినది.
ఇంతలో ఒక వైపునుండి మాధవీలతాకుమారియు, మరియొక వైపునుండి అంశుమతీకుమారియు, నచ్చటకు బరుగిడి వచ్చిరి.
అడివి బాపిరాజు రచనలు - 6
282
అంశుమతి (చారిత్రాత్మక నవల)