పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీరాజనము


తారానికకు నాగదత్తునికి విజయపురిలో వైభవంగా వివాహం జరిగింది. ఇక్ష్వాకుస్వామి శాంతిమూల చక్రవర్తియు, బ్రహ్మదత్తప్రభువు, ఆడవి శాంతిశ్రీయు వివాహాన్ని ఉభయపక్షాల ఉండి వైభవంగా నడిపించినారు. చక్రవర్తి నాగదత్తుని చళుక రాష్ట్రాధిపతి చళుకరాయనిక మహాప్రభువునకు బాసటగా ఉండి పనిచేయవలసిందని ముదల యిచ్చినాడు.

వీరి వివాహమైన కొలది దినాలకు యశోదనాగనిక వివాహమైనది. ఆ వివాహము సాలగ్రామంలోనే జరిగింది. ఆ వివాహానికి సార్వ భౌముడు, మహాప్రభువులు, మహామంత్రి, మహాసేనాపతి, బ్రహ్మదత్తుడు, మహాతలవరులు, దండనాయకులు మొదలగువారెందరో వెడలినారు. విజయపురము విజయపురమంతా అచ్చటనే ఉన్నది. గ్రామం చుట్టూ మహాప్రభువులంతా శిబిరాలు తీర్చినారు. చుట్టుప్రక్కల గ్రామాలవారు వేలకొలది వివాహానికి వచ్చినారు. యశోదనాగనికభర్తను శతగ్రామాధికారిని చేసినాడు చక్రవర్తి. వివాహము ముగిసినది. అడవి శాంతిశ్రీ ధనకమహారాణి భర్తనుచేరి “ప్రభూ! మీరు వెంటనే బయలుదేరండి. మనమిద్దరము కలిసి తీర్థయాత్రలు చేసి వద్దాము” అని ప్రార్థించినది.

“ఏయే తీర్థాలు దేవీ?”

“మనం సప్తదీవులు తిరిగిరావాలని నేను కోరటంలేదు. మనదేశంలోని దివ్యక్షేత్రాలన్నీ తిరిగి వద్దాము.”

ఆమె అతని ఒడిలో ఒరిగిపోయింది. భర్త మెడచుట్టూ తన చేతులు బిగించింది. అతని కళ్ళలోనికి జగన్మోహనాలైన తన చూపులు పరపింద. అతడు వివశుడై,

"ప్రాణేశ్వరీ! నువ్వు బౌద్ధధర్మాభిరతవు. నేను ఆర్షధర్మాచరణ ప్రతుడను. అందుచేత మన యాత్ర చాలా పెద్దదవుతుంది కాదూ?”

“అవును మనం ఇద్దరమే, హిమాలయాలలో, లోయలలో, చరియలలో తెల్లని మంచు వెన్నలా పడేచోటులలో, గడ్డలా పేరుకుపోయే సీమలలో, నదులు, సెలయేళ్ళు, నదీకంఠాలు గలగలలాడగా సుందరశ్రీ చెలువారు ప్రదేశాలలో దేవతలు చరించు దివ్యభూములలో తిరిగివద్దాము రండి.”

“మధురాతి మధురాలైన నీ మాటలు వింటూ ఉంటే....”

“నేను వట్టి స్వప్న బాలికలా ఉన్నానా?”

“నువ్వు నా దివ్యస్వప్నానివి. నువ్వు నా కోటితపస్సుల ఫలం.”

“ఇదా మీ వేదాంత పరమార్థం!”

“నీ ముందు, నీ త్రిజగన్మోహన సౌందర్యం ముందు నా వేదాంతాలు మంచులా కరిగిపోతాయి.”

“నా సౌందర్యం అతితీక్షణమైనా ఎండ వంటిదా?”

“నీ సౌందర్యం అతిసురభిళమైన పూర్ణిమా సుషమ.”

అడవి బాపిరాజు రచనలు - 6

225

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)