అక్కర ఉన్నవారు తామే....”
“అలాగా” అంటూనే రెండంగలలో బ్రహ్మదత్తుడు సువ్వున వచ్చి శాంతిశ్రీని ఎత్తుకొని ఆమె మోము మూర్కొనుచు తీసుకొనిపోయి పీఠంపై కూర్చుండి ఆమెను ఒడిలో ఇమిడించుకొన్నాడు.
“ఇంతటి సౌందర్యం అంతా నువ్వే ప్రోగుచేసుకొంటే లోకంలో స్త్రీలంతా బెంగపెట్టుకోరూ?”
“మీ సౌందర్యంముందు నేను....”
“వింధ్యపర్వతంముందు హిమాలయం అనికాదూ?”
“మాటలు నేర్చిన మగవాళ్ళతో ఎవరు ప్రత్యుత్తరాలు ఇవ్వగలరూ?”
“మాటలు నేర్వని బాలికకు ప్రత్యుత్తరం ఇవ్వడం ఓడిపోవడమే!”
“పోనీలెండి. నేను కళ్ళుమూసుకుంటాను, నాకు ఎంతోకోపం వస్తోంది!”
“ఇదేమిటి లోకం అంతా చీకటైపోయింది. నా హృదయం ముడుచుకు పోయింది.”
“మీరు మరీని!”
“ప్రాణేశ్వరీ! నువ్వు నాకు మరీ మరీ!”
“నాకు ఈ అడవి ఇంటి పేరు ఎంతో గంభీరమై, ఆనందపూర్ణమై ఉన్నదండీ!”
“అడవి ఇంటి పేరు విని మాచెల్లెళ్ళు నవ్వలేదూ?”
“నవ్వలేదుగాని, నవ్వు ఆపుకొని పైకి తేలనీయక మా వదిన శాంతశ్రీ ఏమన్నదో ఎరుగుదురా?”
“చెప్పు ఆత్మేశ్వరీ!”
“కొంచెం వంగండీ. చెవిలో చెప్పుతాను.”
“ఇక్కడ ఎవరున్నారు, రహస్యం వినడానికి?”
“మీ పెదవులు వింటాయి. అవి నాకు ఊపిరాడనీయవు”
“ఇందులో నీ అభ్యంతర మేమిటి? పెదవులకు పెదవులకు చుట్టరికం.
నా కన్నులు నీ అందాన్ని జుఱ్ఱుకొంటవి. నా ముక్కు నీ దివ్యసౌరభాన్ని త్రాగుతుంది. నా చేతులు నీ దేహాన్ని వదలవు. నా హృదయం నీ హదృయాన్ని వదలదు. నా ఆత్మ నిన్ను పూజిస్తుంది.”
“ఇంక నాకు మిగిలింది ఏమిటి?”
“ఆసి దొంగ” అని ఆమెను బిగియార కౌగిలించుకొన్నాడు.
★ ★ ★
అడవి బాపిరాజు రచనలు - 6
224
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)